Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్యపై స్పష్టత.. ఐదు మృతదేహాలు గుర్తింపు
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు. శనివారం మధ్యాహ్నం చోటుచేసుకున్న ఈ అగ్నిప్రమాదం నేపథ్యంలో సుమారు 22 గంటల పాటు సహాయక చర్యలు కొనసాగాయి. భవనం అంతటా దట్టమైన పొగలు వ్యాపించడంతో రెస్క్యూ ఆపరేషన్కు తీవ్ర ఆటంకాలేర్పడ్డాయి. చివరకు మంటల్లో చిక్కుకున్న ఐదు మృతదేహాలను గుర్తించి, ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉండటం విషాదాన్ని మరింత పెంచింది. ప్రమాదంలో అఖిల్ (7), ప్రణీత్ (11), హాబీబ్ (35), ఇంతియాజ్ (32), బేబీ (43) మృతి చెందినట్లు గుర్తించి, మృతదేహాలను మార్చురీకి తరలించారు.
Details
శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం
ఇదిలా ఉండగా, హైదరాబాద్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నాంపల్లిలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నాంపల్లి ప్రధాన రహదారిపై ఉన్న నాలుగు అంతస్తుల కమర్షియల్ భవనంలో ఈ ప్రమాదం సంభవించింది. భవనం కింద భాగంలో ఉన్న సెల్లార్లోని హోల్సేల్ ఫర్నిచర్ షోరూమ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లోపల ఫర్నిచర్ సామాగ్రి అధికంగా ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే పై అంతస్తుల వరకు వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమయంలో భవనంలో పలువురు చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
Details
ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు నిర్ధారణ
అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే స్థానిక యువకులు సాహసోపేతంగా భవనంలోకి వెళ్లి కొంత మంది పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అనంతరం అధికారులు భవనంలో ఉన్న మిగిలిన కుటుంబాలతో పాటు, పక్కనే ఉన్న రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నివాసితులను కూడా తక్షణమే ఖాళీ చేయించారు. తీవ్రమైన శ్రమతో సాగిన సహాయక చర్యల అనంతరం ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఈ ఘటన నగరాన్ని విషాదంలో ముంచెత్తింది.