PM Modi: జాతీయ ఓటర్ల దినోత్సవం.. యువతే భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం : ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న MY-Bharat వాలంటీర్లు, యువతకు ప్రత్యేక లేఖ రాశారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో యువత పాత్ర అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా భారత్ గుర్తింపు పొందిందని పేర్కొంటూనే, ప్రజాస్వామ్యానికి తల్లి దేశంగా భారత్ నిలిచిందన్న గర్వకారణాన్ని గుర్తు చేశారు. శతాబ్దాలుగా చర్చ, సంభాషణ, ప్రజాభిప్రాయం భారత నాగరికతలో విడదీయరాని భాగమని ఆయన లేఖలో పేర్కొన్నారు. 1951లో ప్రారంభమైన తొలి సాధారణ ఎన్నికల నుంచి 75 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా, ఓటు హక్కు ప్రాధాన్యతను ప్రధాని ప్రత్యేకంగా గుర్తు చేశారు.
Details
యువతకు అది జీవితంలో మరపురాని క్షణం
ఓటు వేయడం కేవలం హక్కు మాత్రమే కాదు, అది ఒక గొప్ప బాధ్యత కూడా అని ఆయన లేఖలో వ్యాఖ్యానించారు. ఓటరే దేశ అభివృద్ధి ప్రయాణంలో 'భాగ్య విధాత' అని పేర్కొన్న ప్రధాని, వేలికి పడే చెరగని సిరా ముద్ర ప్రజాస్వామ్యానికి గౌరవ సూచికగా నిలుస్తుందని తెలిపారు. తొలిసారి ఓటు వేయబోతున్న యువతకు అది జీవితంలో మరపురాని క్షణమని ప్రధాని అభివర్ణించారు. అలాంటి సందర్భాలను ఇళ్లలో, నివాస సముదాయాల్లో, విద్యాసంస్థల్లో పండుగ వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. పాఠశాలలు, కళాశాలలు ప్రజాస్వామ్య విలువలకు పునాదులని పేర్కొంటూ, విద్యార్థులు ఓటర్లుగా మారే దశను ఘనంగా గుర్తించాలన్నారు.
Details
విద్యాసంస్థలు ఉద్యమ కేంద్రాలుగా మారాలి
ప్రతి అర్హత కలిగిన యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని, ఈ దిశగా విద్యాసంస్థలు ఉద్యమ కేంద్రాలుగా మారాలని ప్రధాని పిలుపునిచ్చారు. ప్రతి సంవత్సరం జనవరి 25న జరుపుకునే జాతీయ ఓటర్ల దినోత్సవం ఇందుకు సరైన వేదికగా ఉంటుందని పేర్కొన్నారు. భారత ఎన్నికలు ప్రపంచానికి ఒక లాజిస్టికల్ అద్భుతమైతే, భారతీయులకు మాత్రం అది ఒక ప్రజాస్వామ్య పండుగ అని ప్రధాని వ్యాఖ్యానించారు. హిమాలయాల నుంచి అండమాన్ దీవుల వరకు, అరణ్యాల నుంచి ఎడారుల వరకు ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడమే భారత ప్రజాస్వామ్య బలమని ఆయన అన్నారు.
Details
వారి చైతన్యం దేశానికి గొప్ప బలం
మహిళల భాగస్వామ్యం, ముఖ్యంగా యువ మహిళల చురుకైన పాత్ర ప్రజాస్వామ్యాన్ని మరింత సమగ్రంగా మారుస్తోందని పేర్కొంటూ, వారి చైతన్యం దేశానికి గొప్ప బలమని ప్రశంసించారు. MY-Bharat వేదికతో యువత అనుబంధం సేవ చేయాలనే తపనకు నిదర్శనమని ప్రధాని తెలిపారు. ఎదురు చూసే తరం కాకుండా 'Can Do Spirit'తో మార్పును తీసుకొచ్చే తరం యువతేనని పేర్కొన్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, అభివృద్ధి చెందిన, సమగ్ర, స్వావలంబన భారత్ కోసం ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని ప్రధాని తన లేఖ ద్వారా పిలుపునిచ్చారు.