AP High Court: హైకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యం.. నలుగురు ఐఏఎస్లకు వారెంట్లు
ఆంధ్రప్రదేశ్లో నలుగురు ఐఏఎస్ అధికారులకు బెయిలబుల్ వారెంట్లను రాష్ట్ర హైకోర్టు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడం వల్ల ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ బెయిలబుల్ వారెంట్లు శశి భూషణ్, రావత్, కృతి శుక్లా, హిమాన్ష్ శుక్లా అనే నలుగురు ఐఏఎస్ అధికారులపై జారీ చేశారు. వారెంట్ అమలుకు సంబంధించిన విచారణ నవంబర్ 27కి వాయిదా వేసినట్టు సమాచారం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకటేశ్వర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు.
వివరణ ఇవ్వాలి
ఈ నలుగురు అధికారులు హాజరై వివరణ ఇవ్వాలని ఇచ్చిన ఆదేశాలను పాటించక పోవడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశి భూషణ్ కుమార్, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్. రావత్, కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా పై బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.