Bihar: 20న బీహార్లో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం.. హాజరుకానున్న ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
బిహార్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ సాధించింది. మొత్తం 243 స్థానాల్లో 202 సీట్లను గెలుచుకుని స్పష్టమైన ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఈ విజయంతో నితీష్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. రాబోయే 20వ తేదీ గురువారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు శుభముహూర్తం ఖరారైంది. నితీశ్ కుమార్తో పాటు మంత్రివర్గ సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పాట్నాలోని చారిత్రక గాంధీ మైదాన్ ఈ కార్యక్రమానికి వేదికగా నిలుస్తుంది. ఈ వేడుకకు ప్రధాన అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు.
వివరాలు
నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా
ఇదిలా ఉండగా, ప్రస్తుత మంత్రివర్గం సోమవారం ఉదయం 11.30కు చివరి సమావేశం నిర్వహించనుంది. సీఎంగా నితీశ్ కుమార్ నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన తీర్మానం ఆమోదం పొందే అవకాశముంది. అనంతరం నితీశ్ కుమార్ సీఎం పదవికి రాజీనామా చేసి, రాజీనామా పత్రాన్ని గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్కు సమర్పించనున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ గెలిచిన 202 సీట్లలో, బీజేపీ 89 స్థానాలు, జేడీ(యూ) 85 స్థానాలు, కూటమి భాగస్వామి ఎల్జేపీ (రామ్ విలాస్) 19 సీట్లు, హెచ్ఏఎం 5 సీట్లు, ఆర్ఎల్ఎస్పీ 4 సీట్లు సాధించాయి. ఈ ఫలితాలతో బీహార్లో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమమైంది.