
Fake News : తప్పుడు వార్తలపై కొత్త చట్టం : 7 ఏళ్లు జైలు, రూ.10 లక్షలు జరిమానా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పట్లో ఎక్కడ చూసినా ఫేక్ వార్తలే రాజ్యం చేస్తున్నాయి. 'బ్రేకింగ్ న్యూస్' అంటూ షాకింగ్ కంటెంట్ పెట్టే ఫేక్గాళ్లు విపరీతం అయ్యారు. నటుడు కోటా శ్రీనివాసరావు చనిపోయారంటూ ఇప్పటివరకు ఎన్నిసార్లు తప్పుడు వార్తలు వైరల్ చేశారో లెక్కే లేదు. రోజువారీగా ఇలా డజన్ల కొద్దీ ఫేక్ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధం లాంటి మేజర్ ఘటనలపై ఫేక్గాళ్లు పండగ చేసుకుంటారు. 'ఆ విమానం కూలింది', 'ఇంతమంది సైనికులు మరణించారు' అంటూ శత్రుదేశాలపై తప్పుడు సమాచారం సృష్టిస్తుంటారు. సెలబ్రిటీలకే కాకుండా అమ్మాయిలపై కూడా చెడుగా ట్రోల్ చేయడం, అసభ్య పోస్టులతో రెచ్చిపోవడం, మత విషయాలపై తప్పుడు ప్రచారం చేయడాన్ని కొందరు హాబీగా మార్చుకున్నారు. రాజకీయ యుద్ధాల్లో ఫేక్ న్యూస్కే అప్పర్హ్యాండ్ ఉంటుంది.
Details
కఠిన చట్టాల దిశగా ప్రభుత్వం
తెలంగాణలో బీఆర్ఎస్, ఏపీలో వైసీపీ ఫేక్ కంటెంట్తోనే నిలదొక్కుకుంటున్నాయని విమర్శలు వినిపిస్తుంటాయి. ఇలా చూస్తే ప్రస్తుత ప్రపంచంలో పొద్దున నుంచి రాత్రివరకు మనం చూసే, వినే విషయాలలో సగానికి పైగా అసత్యాలే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇలాంటి ఫేక్ న్యూస్, ఫేక్గాళ్లకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. రెండు రకాల కొత్త బిల్లులను తీసుకురానుంది. 1. ఫేక్ న్యూస్ ప్రొహిబిషన్ బిల్ 2025 2. హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైం ప్రివెన్షన్ బిల్ 2025 తప్పుడు వార్తలు, మహిళలపై అసభ్య పోస్టులు, సనాతన చిహ్నాలు, మతాలపై తప్పుడు సమాచారం ప్రచారం చేసిన వారిపై 7 ఏళ్లు జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా లేదా రెండింటినీ విధించే అవకాశం ఉంది.
Details
సోషల్ మీడియా సంస్థలకూ శిక్ష
కామెడీ, వ్యంగ్యం, పేరడీ పేరుతో కూడా ఎవరైనా ఓవరాక్షన్ చేస్తే, కఠిన చర్యలకు లోనవుతారు. తప్పుడు వార్తలను పోస్ట్ చేసి ప్రచారం చేసిన వ్యక్తులతో పాటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టా లాంటి సంస్థలు ఫేక్ కంటెంట్ తొలగించడం తప్పనిసరి. కోర్టులు ఆదేశిస్తే వెంటనే తొలగించకపోతే, కంపెనీలకే రెండేళ్ల వరకు జైలు శిక్ష, రూ.25 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Details
ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు ప్రతిపాదన
కొత్త చట్టాల కింద నేరాల విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కూడా బిల్లు ప్రతిపాదిస్తోంది. కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా ముసాయిదా బిల్లులను సిద్ధం చేసింది. అవి చట్టాలుగా మారితే ఫేక్గాళ్ల ఖేల్ ఖతం కావచ్చు. ఈ తరహా చట్టాలు దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.