LOADING...
Ration shops: కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్‌ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు 
కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్‌ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు

Ration shops: కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్‌ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 24, 2025
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

పౌరసరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కరణలను చేపడుతోంది. ఇప్పటికే స్మార్ట్‌ రేషన్‌ కార్డులు ప్రవేశపెట్టారు. ఇప్పుడు, రోజంతా రేషన్‌ సరఫరా చేయడానికి కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. దీనికి చౌకధర దుకాణాలను మినీమాల్స్‌‌గా మార్చాలని నిర్ణయించారు. ఈ ప్రయత్నానికి రాజమహేంద్రవరం, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, విజయవాడ నగరాలను పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేశారు. ప్రస్తుతం రేషన్‌ దుకాణాలు ప్రతి నెలా 1-15 వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు బియ్యం, ఇతర నిత్యావసరాలను అందిస్తున్నాయి. అయితే కొంతమంది డీలర్లు సరిగా దుకాణాలను నిర్వహించకపోవడం, సమయపాలన పాటించకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Details

సూమారు 12 గంటలు దుకాణాలు తెరిచే అవకాశం

ఈ సమస్యలను పరిష్కరించేందుకు, మినీమాల్స్‌ విధానంలో రోజంతా సుమారు 12 గంటలు దుకాణాలు తెరిచి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. మినీమాల్స్‌లో, జాతీయ వ్యవసాయ కో-ఆపరేటివ్‌ సొసైటీ, గిరిజన కార్పొరేషన్‌ ద్వారా చౌకధర దుకాణాలకు అన్ని నిత్యావసరాలు సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వస్తువులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందా, లేక డీలర్లు కొనుగోలు చేయాలా అనే అంశం, అలాగే లబ్ధిదారులకు రాయితీ ఇవ్వబడుతుందా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

Details

ఒక్కో నగరంలో 15 నుంచి 75 దుకాణాలు

పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా, రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు అన్ని నిత్యావసరాలు అందుబాటులో ఉంచేందుకు, ఒక్కో నగరంలో 15 నుంచి 75 దుకాణాలను ఎంపిక చేస్తున్నారు. అధికారులు పేర్కొన్న ప్రకారం, ఈ వారంలోనే ఈ ప్రాసెస్ ప్రారంభించబడుతుంది. ఇప్పటి వరకు రేషన్‌ డీలర్లు రోజులో కొన్ని గంటల మాత్రమే దుకాణంలో ఉంటూ, మిగతా సమయాన్ని ఇతర పనులకు ఉపయోగించేవారు. మినీమాల్స్‌ విధానంలో వారు రోజంతా అక్కడే ఉంటారు. డీలర్లు నష్టపోకుండా, సరైన ఉపాధి పొందేలా, అన్నిరకాల నిత్యావసరాలను అందుబాటులో ఉంచనున్నారు.