BPCL LPG ATM: గ్యాస్ కోసం ఇక క్యూలు అవసరం లేదు.. దేశంలో తొలి ఎల్పీజీ ఎటిఎం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. హర్యానాలోని గురుగ్రామ్ (సోహనా, సెక్టార్-33)లో దేశంలోనే తొలి ఎల్పీజీ ఏటీఎంను పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ఎలా పనిచేస్తుంది అంటే ఈ ఎల్పీజీ ఏటీఎం ద్వారా గ్యాస్ సిలిండర్ పొందడం డబ్బులు డ్రా చేసినంత సులభమని అధికారులు చెబుతున్నారు. ముందుగా వినియోగదారు తన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను నమోదు చేయాలి. తర్వాత మొబైల్కు వచ్చే OTPను ఎంటర్ చేసి ధృవీకరించాలి. అనంతరం పాత సిలిండర్పై ఉన్న బార్కోడ్ లేదా QR కోడ్ను స్కాన్ చేయాలి.
Details
తేలికైన కంపోజిట్ సిలిండర్లు
తరువాత యూపీఐ (UPI), క్రెడిట్/డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు పూర్తి చేయాలి. పాత ఖాళీ సిలిండర్ను యంత్రంలో ఉంచగానే, కేవలం 2-3 నిమిషాల్లో నిండిన కొత్త సిలిండర్ బయటకు వస్తుంది. ఈ ఏటీఎంలో లభించే సిలిండర్లు సాధారణ ఇనుప సిలిండర్లు కావు. ఇవి ఫైబర్ ఆధారిత 'కంపోజిట్ సిలిండర్లు'. సాధారణంగా గ్యాస్తో కలిపి 31 కిలోల బరువు ఉండే సిలిండర్తో పోలిస్తే, ఇవి కేవలం 15 కిలోలే ఉంటాయి. తక్కువ బరువు కారణంగా ఎవరైనా సులభంగా మోసుకెళ్లవచ్చు. అంతేకాకుండా ఇవి వినియోగంలో కూడా అధిక భద్రత కలిగినవిగా భావిస్తున్నారు.
Details
24 గంటల సేవలు
ఈ ఆటోమేటిక్ వెండింగ్ మెషిన్ వారంలో ఏడు రోజులు, 24 గంటలపాటు పనిచేస్తుంది. గ్యాస్ ఏజెన్సీలపై ఆధారపడకుండా, సరఫరాలో అంతరాయం లేకుండా సేవలు అందించేందుకు దీనిని రూపకల్పన చేశారు. మిషన్లో గ్యాస్ స్టాక్ తగ్గిపోగానే సమీప ఏజెన్సీలకు ఆటోమేటిక్ అలర్ట్ వెళ్లి రీఫిల్ జరుగుతుంది. గ్యాస్ ఏజెన్సీలపై వినియోగదారుల ఆధారాన్ని తగ్గించడం, యుద్ధం వంటి అత్యవసర పరిస్థితుల్లో కూడా సరఫరా అంతరాయం లేకుండా చేయడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని అధికారులు తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశవ్యాప్తంగా మరిన్ని నగరాల్లో ఎల్పీజీ ఏటీఎంలను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం.