Pawan Khera: పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
ఈ వార్తాకథనం ఏంటి
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సతీమణి రిణికి భూయాన్ శర్మకు అనేక పాస్పోర్టులు, విదేశీ ఆస్తులు ఉన్నాయని ఖేరా ఆరోపించగా, ఆమె ఫిర్యాదు మేరకు గువాహటిలో ఆయనపై కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం ఖేరా చేసిన వినతిని గౌహతి హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. ఈ కేసులో విచారణ కోసం ఖేరాను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం లేదని సింఘ్వీ కోర్టుకు తెలిపారు.
వివరాలు
అస్సాం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు
పరువు నష్టం అంశంలో నిర్బంధ విచారణ అవసరం లేదని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చట్టాలకు అతీతంగా ప్రవర్తించారని, ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యల కారణంగానే ఖేరా అరెస్టుకు పోలీసులు చర్యలు ప్రారంభించారని ఆరోపించారు. కొన్ని సెక్షన్ల కింద బెయిల్ పొందే వీలుందని,మరికొన్నిసెక్షన్ల కింద అరెస్టు అవసరమే లేదని వాదించారు. ఇక అస్సాం పోలీసుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ముఖ్యమంత్రి సతీమణికి సంబంధించిన పాస్పోర్టుల విషయంలో ఖేరా చూపించిన పత్రాలు నకిలీ, వక్రీకరించినవని తెలిపారు. అవి అసత్యమైన కాపీలేనని కోర్టుకు వెల్లడించారు.ఖేరా పరారీలో ఉండి వీడియోలు విడుదల చేస్తున్నారని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు,ముందస్తు బెయిల్ అభ్యర్థనపై తన తీర్పును రిజర్వ్ చేసినట్లు తెలిపింది.