
Family suicide: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త సంవత్సరం వేళ.. పంజాబ్ జలంధర్లోని దరౌలీ ఖుర్ద్ గ్రామంలో దారుణం జరిగింది.
అప్పుల బాధతో ఓ బాలిక సహా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
మృతులను మన్మోహన్ సింగ్(55), సర్బ్జిత్ కౌర్(55), ఇద్దరు కుమార్తెలు ప్రభ్జోత్ అలియాస్ జ్యోతి(32), గురుప్రీత్ కౌర్(31), జ్యోతి కుమార్తె అమన్ (3)గా గుర్తించారు.
ఖుర్ద్లో పోస్టాఫీసులో పనిచేస్తున్న మన్మోహన్ సింగ్, అతని కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు.
మన్మోహన్ అల్లుడు సర్బ్జిత్ సింగ్ శనివారం నుంచి తన అత్తమామలకు ఫోన్ చేస్తున్నా.. వారు ఎత్తలేదు.
దీంతో ఆదివారం రాత్రి ఆయనే ఖుర్ద్కు వచ్చారు. ఇంటికి వచ్చి చూడగా.. ఐదు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని సర్బ్జిత్ సింగ్ తెలిపారు.
పంజాబ్
నలుగురిని హతమార్చి.. ఆపై ఆత్మహత్య?
ఘటనా స్థలం నుంచి సూసైడ్ నోట్ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
అధికారికంగా ఎవరూ ధృవీకరించనప్పటికీ. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు.
మన్మోహన్ సింగ్ చాలా కాలంగా అప్పుల బాధలో ఉన్నారని చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
విచారణ కోసం ఫోరెన్సిక్ బృందం కూడా చేరుకుందని అడంపూర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ మంజీత్ సింగ్ చెప్పారు.
నలుగురిని హతమార్చిన తర్వాత మన్మోహన్ సింగ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడా? అనేది పోస్ట్ మార్టం నివేదిక తర్వాత స్పష్టమవుతుందని ఎస్ఎస్పీ ముఖ్వీందర్ సింగ్ చెప్పారు.