Page Loader
Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో  'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్ 
రైల్వే స్టేషన్‌లో 'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్

Delhi Railway Station: రైల్వే స్టేషన్‌లో  'ఉచిత' వీల్‌చైర్ సేవలకు ఎన్నారై నుంచి ₹10,000 వసూలుచేసిన పోర్టర్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 02, 2025
02:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఒక ఎన్నారైకు వీల్‌చైర్ సేవల కోసం రూ. 10 వేలు వసూలు చేసిన ఘటనను రైల్వే అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ అంశంపై విచారణ చేపట్టడంతో పాటు సంబంధిత పోర్టర్ లైసెన్స్‌ను రద్దు చేశారు. అలాగే, ప్రయాణికుడి నుంచి వసూలు చేసిన మొత్తం డబ్బులో 90 శాతం తిరిగి ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను సహించబోమని నార్తరన్ రైల్వేస్ స్పష్టం చేసింది. పోర్టర్ బ్యాడ్జ్‌ను ఢిల్లీ డివిజన్ అధికారులు వెనక్కి తీసుకున్నారు. ప్రయాణికుల ప్రయోజనాలు తమకు ముఖ్యమని రైల్వే మరోసారి స్పష్టం చేసింది. రైల్వే స్టేషన్లలో వీల్‌చైర్ సేవలు ఉచితంగా అందుబాటులో ఉంటాయని గుర్తు చేసింది.

వివరాలు 

 139 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచన

కానీ, డిసెంబర్ 28న, తన తండ్రి నుంచి రూ. 10 వేలు వసూలు చేశారంటూ ఒక ఎన్నారై ప్రయాణికుడి కుమార్తె పాయల్, రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోర్టర్‌ను గుర్తించిన అధికారులు, అతడి నుంచి రూ. 9 వేలు తిరిగి తీసుకుని ప్రయాణికుడికి అందజేశారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన డివిజనల్ రైల్వే మేనేజర్, రైల్వే ప్రయాణికుల సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణానికి కట్టుబడి ఉందని తెలిపారు. ఇలాంటి సంఘటనలు రైల్వే ప్రతిష్ఠను దిగజారుస్తాయని, ప్రయాణికుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని వ్యాఖ్యానించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రయాణికుల సమస్యలు ఎదురైతే 139 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.