Supreme Court: NTAలో సమూల మార్పులు.. UPSC తరహా శాస్త్రీయ వ్యవస్థ అవసరం: సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షల నిర్వహణలో మరింత శాస్త్రీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) తరహాలో శాస్త్రీయంగా, పటిష్ఠంగా పనిచేసే సంస్థాగత వ్యవస్థను NTAలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. NEET-UG 2026 ప్రశ్నపత్రం లీక్ నేపథ్యంలో NTAలో నిర్మాణాత్మక మార్పులు చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై బుధవారం జస్టిస్ పీఎస్ నరసింహ,జస్టిస్ అలోక్ అరాధేల ధర్మాసనం విచారణ చేపట్టింది. NEET పరీక్షల వ్యవస్థలో సంస్కరణలను సంస్థాగతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ధర్మాసనం పేర్కొంది. కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫార్సులు, అనంతరం నందన్ నీలేకని నేతృత్వంలోని కమిటీ సూచించిన మార్పుల అమలు పరిస్థితిపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు వివరాలు కోరింది.
వివరాలు
సిఫార్సుల అమలుపై NTA నుంచి తాజా అఫిడవిట్ కోరిన సుప్రీంకోర్టు
ఈ సిఫార్సులపై NTA ఇప్పటివరకు తీసుకున్న చర్యలను తెలియజేస్తూ తాజా అఫిడవిట్ దాఖలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ధర్మాసనం ఆదేశించింది.
రాధాకృష్ణన్ కమిటీ సమస్యను కేవలం ఒక పరీక్షకు సంబంధించినదిగా కాకుండా వ్యవస్థలో ఉన్న లోపంగా గుర్తించిందని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇలాంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సంస్థాగత మార్పులు చేయడం అత్యంత ముఖ్యమని పేర్కొంది.
కాగితాలపై అన్ని విధానాలు సరిగానే కనిపిస్తున్నప్పటికీ, ఒక పరీక్ష తర్వాత మరో పరీక్షకు పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
వివరాలు
NEET ప్రశ్నపత్రాల భద్రతపై కేంద్రం వివరణ.. 'ఫూల్ప్రూఫ్'గా వ్యవస్థ
మరోవైపు ప్రశ్నపత్రాల భద్రత కోసం NTA ప్రస్తుతం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరించింది.
ఈ భద్రతా చర్యలు దాదాపు పూర్తిగా లోపాలు లేని విధంగా ఉన్నాయని తుషార్ మెహతా పేర్కొన్నారు.
అయితే ప్రక్రియలో మనుషుల ప్రమేయం ఉన్నందున కొన్ని పొరపాట్లకు అవకాశం ఉంటుందని ఆయన అంగీకరించారు.
NEET ప్రశ్నపత్రాల తయారీ ప్రక్రియలో పలువురు మోడరేటర్లు ప్రశ్నలను రూపొందిస్తారని, అనంతరం మరో బృందం వాటిని పరిశీలించి నాలుగు ప్రశ్నపత్రాలను సిద్ధం చేస్తుందని మెహతా తెలిపారు.
చివరకు ఏ ప్రశ్నపత్రాన్ని పరీక్షకు ఉపయోగిస్తారో ఆ ప్రక్రియలో పాల్గొన్న వారికి ముందుగా తెలియదని వివరించారు.
వివరాలు
NEET ప్రశ్నపత్రాల భద్రతకు పటిష్ఠ చర్యలు.. వ్యవస్థాగత మార్పులు అవసరమన్న సుప్రీంకోర్టు
ఎంపిక చేసిన ప్రశ్నపత్రాలను సీసీటీవీ నిఘా ఉన్న ప్రత్యేక ముద్రణ కేంద్రాలకు సీల్ చేసిన కవర్లలో పంపిస్తామని కేంద్రం తెలిపింది.
ఈకేంద్రాలకు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం(CISF)భద్రత కల్పిస్తుందని పేర్కొంది.
అనంతరం ప్రశ్నపత్రాలను GPS సౌకర్యం ఉన్న వాహనాల్లో భద్రతతో తరలిస్తామని వివరించింది.
వాటిని స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరిచే సమయంలో వీడియో చిత్రీకరణతో పాటు అధికారికంగా రికార్డులు నిర్వహిస్తామని తెలిపింది.
పరీక్ష రోజు కూడా సీల్ చేసిన బాక్సులను ఇద్దరు విద్యార్థుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేస్తూ తెరిచి,తరగతి గదుల వారీగా ప్రశ్నపత్రాలను పంపిణీ చేస్తామని కేంద్రం సుప్రీంకోర్టుకు వివరించింది.
అయితే ఇన్ని భద్రతాచర్యలు ఉన్నప్పటికీ NEET వంటి కీలక పరీక్షల నిర్వహణలో వ్యవస్థాగత మార్పులు అవసరమని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.