
Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 71,380 మంది భార్యలకు (స్పౌజ్) పింఛన్లను మంజూరు చేసింది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూన్ 12నటికి ఒక సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, అదే రోజున రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త స్పౌజ్ పింఛన్లను లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది.
భార్యాభర్తలలో భర్త సామాజిక భద్రతా పింఛను పొందుతూ మృతిచెందితే, ఆ కుటుంబంలో భార్యకు వెంటనే తదుపరి నెల నుంచే పింఛను అందేలా కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా స్పౌజ్ పింఛను కేటగిరీని ప్రవేశపెట్టింది.
ఈ పథకాన్ని గతేడాది నవంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి తీసుకువచ్చారు.
వివరాలు
నిధులు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లోకి జమ
ఈ కేటగిరీకి సంబంధించి 2023 డిసెంబరు 1 నుండి 2024 అక్టోబరు 31 మధ్యకాలంలో అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను ప్రభుత్వం స్వీకరించింది.
అర్హత ప్రమాణాలను పరిశీలించిన తర్వాత మొత్తం 71,380 మందిని అర్హులుగా గుర్తించింది.
ఈ పింఛన్లకు సంబంధించిన మే నెల నిధిగా ఒక్కొక్కరికి రూ. 4,000 చొప్పున జూన్ 12వ తేదీన పంపిణీ చేయనుంది.
జూన్ 11 నాటికి ఈ మొత్తం నిధులు గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లోకి జమ చేయబోతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ మేరకు సెర్ప్ (SERP) సీఈవో వాకాటి కరుణ గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.