Andhrapradesh: గాడిలో పడని నర్సింగ్ విద్యా వ్యవస్థ..ఐదేళ్లలో భర్తీ కాని సీట్ల సంఖ్య 33,245
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రంలో వైద్య రంగానికి వెన్నెముకగా నిలిచే నర్సింగ్ విద్యా వ్యవస్థ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో గాడిలో పడలేదు. నర్సింగ్ కోర్సులపై విద్యార్థుల్లో ఆసక్తి ఉన్నప్పటికీ, ప్రతి విద్యా సంవత్సరం ప్రవేశ ప్రక్రియలో నెలకొనే తీవ్ర జాప్యం వల్ల ఒక విద్యా సంవత్సరం వృథా అయ్యే పరిస్థితి ఏర్పడుతోంది. ఈ కారణంగా నర్సింగ్లో చేరాలనుకున్న అనేక మంది విద్యార్థులు చివరకు డిగ్రీ లేదా ఇతర ప్రత్యామ్నాయ కోర్సులను ఎంచుకోవాల్సి వస్తోంది. మరోవైపు, గత కొన్నేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా వేలాది నర్సింగ్ సీట్లు ఖాళీగానే మిగిలిపోతున్నప్పటికీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చర్యలు కనిపించడం లేదు.
వివరాలు
సీట్ల పెరుగుదలతో పాటు ఖాళీల సంఖ్య కూడా అధికమే..
రాష్ట్రంలో నర్సింగ్ విద్యాసంస్థల సంఖ్యతో పాటు అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2021-22 విద్యా సంవత్సరంలో 179 బీఎస్సీ నర్సింగ్ కళాశాలలు ఉండగా, 2025-26 నాటికి వాటి సంఖ్య 266కు చేరుకుంది. ఇదే కాలంలో బీఎస్సీ నర్సింగ్ సీట్లు 9,315 నుంచి 14,765కు పెరిగాయి. అలాగే జనరల్ నర్సింగ్ అండ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) పాఠశాలల సంఖ్య 300 నుంచి 319కు పెరగగా, సీట్లు 15,365 నుంచి 16,792కు విస్తరించాయి. వైద్య సేవలను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొత్త నర్సింగ్ విద్యాసంస్థలకు వైద్యారోగ్య శాఖ అనుమతులు మంజూరు చేస్తున్నప్పటికీ, విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవడం లేదు.
వివరాలు
ప్రవేశ విధానాలు మారినా ఆశించిన ఫలితం లేదు..
గతంలో నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు ఇంటర్మీడియట్లో సాధించిన మార్కులు లేదా ఎంసెట్ ఆధారంగా నిర్వహించేవారు. అయితే 2025-26 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఎన్సెట్) ద్వారా ప్రవేశాలను నిర్వహించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ఈ విధానాన్ని అమలు చేయడంతో పాటు పరీక్షను కేవలం విజయవాడలో మాత్రమే నిర్వహించడం వల్ల విద్యార్థుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా 4,739 నర్సింగ్ సీట్లు ఖాళీగానే మిగిలిపోయాయి. అనంతరం ఈ ఖాళీలను భర్తీ చేయడానికి ఇంటర్మీడియట్ మెరిట్ ఆధారంగా విద్యార్థులకు అవకాశం కల్పించినప్పటికీ, అందుబాటులో ఉన్న సీట్లన్నీ భర్తీ కాలేదు.