Odisha: ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ఒడిశా మంత్రి మేనల్లుడిపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మేనల్లుడు బిశ్వజిత్ జెనా (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. తన ప్రేయసి ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు నమోదైన కేసులో అతడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాం జిల్లాలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల హాస్టల్లో విద్యార్థిని మృతిచెందిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. పోలీసుల సమాచారం ప్రకారం, మృతురాలు 20 ఏళ్ల బాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ (బీసీఏ) విద్యార్థిని. శనివారం ఆమె హాస్టల్ గదిలో సీలింగ్కు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
వివరాలు
డిజిటల్ ఆధారాలు సేకరించిన అనంతరం బిశ్వజిత్ జెనా అరెస్ట్
మృతురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా గోలంథర పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అదే కళాశాలలో బీసీఏ చదువుతున్న బిశ్వజిత్ జెనాపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు ఆరోపణలు నమోదయ్యాయి. అరెస్టుకు ముందు సీనియర్ పోలీసు అధికారులు,శాస్త్రీయ నిపుణుల బృందం ఘటనాస్థలిని పరిశీలించింది. డిజిటల్ ఆధారాలను సేకరించిన అనంతరం బిశ్వజిత్ జెనాను అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా మృతురాలు,నిందితుడికి చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఈ ఘటనపై ప్రతిపక్ష బిజు జనతాదళ్(బీజేడీ)తీవ్రంగా స్పందించింది.బిశ్వజిత్ జెనాను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. మాజీ ఎమ్మెల్యే రమేష్ చంద్ర అయ్యావు పట్నాయక్ మాట్లాడుతూ,"నిందితుడు మంత్రికి బంధువైనా సరే పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి. చట్టం తన పని తాను చేసుకోవాలి" అని పేర్కొన్నారు.
వివరాలు
ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని మంత్రి బిభూతి భూషణ్ జెనా
గంజాం జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి దోరా కూడా నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలని కోరారు. మరోవైపు భారతీయ జనతా పార్టీ గంజాం జిల్లా అధ్యక్షుడు సరోజ్ సబత్ మాట్లాడుతూ, పోలీసులు కేసును సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. మరణానికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే వెల్లడవుతుందని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు మంత్రి బిభూతి భూషణ్ జెనా గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఈ ఘటనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, విచారణలో వెలుగులోకి వచ్చే వివరాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు.
వివరాలు
ఆత్మహత్య ఆలోచనలు ఉంటే వెంటనే సహాయం పొందండి
మీకు లేదా మీకు తెలిసిన ఎవరికైనా ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు వస్తున్నట్లయితే, వెంటనే సహాయం కోసం సంప్రదించండి. ఆత్మహత్య నివారణ కౌన్సెలింగ్ సేవలను అందించే ఆస్రా (AASRA) సంస్థను 24 గంటల పాటు అందుబాటులో ఉన్న 022-27546669 నంబర్లో సంప్రదించవచ్చు. అలాగే రోష్ని ఎన్జీఓ (Roshni NGO) ను +91-4066202000, కూజ్ (COOJ) ను +91-83222-52525 నంబర్లలో సంప్రదించవచ్చు. 24 గంటల సేవలు అందించే స్నేహా ఇండియా ఫౌండేషన్ (Sneha India Foundation) హెల్ప్లైన్ నంబర్ +91-44246-40050. అలాగే వాండ్రేవాలా ఫౌండేషన్ (Vandrevala Foundation) ను +91-99996-66555 నంబర్లో కాల్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించవచ్చు.