Amaravati Capital: అమరావతికి అధికారిక గెజిట్.. త్వరలో పార్లమెంట్లో రాజధాని బిల్లు ప్రవేశం
ఈ వార్తాకథనం ఏంటి
అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకారం, అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో అమరావతి రాజధాని బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో రాజధాని విషయంపై చర్చించారని గుర్తుచేశారు. ప్రస్తుతానికి హోం శాఖలో ఫైల్ క్లియర్ అయి, న్యాయశాఖ పరిశీలనలో ఉందని సమాచారం ఉంది. రాజధాని నిర్మాణంలో భాగంగా రైతుల భూవినిమయ ఒప్పందంలో 98 శాతం ప్లాట్ల పంపిణీ పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
Details
త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం
మిగిలిన 2 శాతం సమస్యలు కూడా త్వరలో పరిష్కారం కానున్నాయని తెలిపారు. అమరావతిని రాష్ట్ర రాజధానిగా శాశ్వతంగా ప్రకటించేందుకు పార్లమెంట్ ద్వారా బిల్లు తీసుకురావాలనే ఆలోచన ఉందని వెల్లడించారు. దీంతో అమరావతి రాజధాని విషయంలో శాసనపరంగా పూర్తి నిర్ధారణ కలగడానికి అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నారు. గెజిట్ ప్రక్రియపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో, రాజధాని ప్రాంతంలో తిరిగి కార్యకలాపాలు వేగం పెంపొందే సూచనలు కనిపిస్తున్నాయి. రాజధానిలో రైతుల సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ సమావేశం జరిగింది. రైతుల సమస్యలు, ప్లాట్ల కేటాయింపు, జరీబు భూములు, గ్రామ కంఠ సమస్యలు వంటి అంశాలు చర్చకు వచ్చాయి.
Details
లంక గ్రామాలకు సంబంధించి కోర్టులో కేసులు
మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, దాదాపు 30,000 మంది రైతులు, 34,000 ఎకరాలకు పైగా భూములను రాజధానికి ఇచ్చినట్లుగా చెప్పారు. "రైతుల త్యాగాలు ఎప్పటికీ గుర్తుండాలి. ఇన్ని వేల మంది ఉన్నందున కొన్ని సమస్యలు వస్తాయి. 700 ఎకరాల్లో ప్లాట్లు కేటాయించబడాలి, కానీ అసైన్డ్ ల్యాండ్, ఇతర కారణాల వల్ల కొన్ని ప్లాట్లు ఇంకా కేటాయించబడలేదు. 30 రోజుల్లో జరీబు సమస్యలకు పరిష్కారం చేస్తామని అన్నారు. కొంతమంది గైడ్లైన్స్ పాటించకపోవడం వల్ల ఇబ్బందులు వచ్చాయని, లంక గ్రామాలకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. లంక ప్రాంత భూములను తీసుకుని సరైన భూమిని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నామని కూడా వెల్లడించారు.
Details
ఆరు నెలల్లో రైతుల సమస్యలన్నీ పరిష్కారం
ఇక, అసైన్డ్ ల్యాండ్స్ విషయంలో మరొక పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కొంతమంది భూములను అమ్మినట్లు గుర్తించబడి, రాష్ట్రం మొత్తం పరిస్థితిని అంచనా వేయాల్సి ఉందని చెప్పారు. "90 రోజుల్లో అసైన్డ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించుతాము. ఐదుగురు కాంట్రాక్టర్లు రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టి పెడతారు. వచ్చే జూన్ లో గ్రామాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తాం. వచ్చే ఆరు నెలల్లో రైతుల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం ఉందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.