
Operation Sindhu: ఆపరేషన్ సిందూ విజయవంతం.. 19 విమానాల్లో 4,400 మంది ఇండియాకి!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత ప్రభుత్వం భారీ స్థాయిలో రక్షణ చర్యలు చేపట్టింది. విదేశాంగ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకారం 'ఆపరేషన్ సిందూ' పేరిట ఇప్పటివరకు 4,400 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తరలించారు. ఈ చర్యలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. వీరి తరలింపులో భాగంగా 19 ప్రత్యేక విమాన సర్వీసులు నడిపినట్లు వెల్లడించారు. తాజాగా ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్ చేరుకున్న 173 మంది భారతీయులు గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఈసందర్భంగా విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి పరిస్థితులను విశ్లేషించిన తరువాత ప్రభుత్వం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
Details
పెద్ద ఎత్తున్న రక్షణ చర్యలు
ప్రస్తుతానికి ఇరాన్లో సుమారు 10 వేల మంది, ఇజ్రాయెల్లో 40 వేల మంది భారతీయులున్నారని పేర్కొన్నారు. భారతీయుల రక్షణ చర్యల్లో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్ దేశాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే గగనతలాన్ని తెరిచిన ఇరాన్ (20వ తేదీ), సహకరించిన తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు జూన్ 13న ప్రారంభమయ్యాయి. అనంతరం జూన్ 22న అమెరికా, ఇరాన్ అణు వసతులపై దాడులు చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమై, పెద్ద ఎత్తున రక్షణ చర్యలు చేపట్టడం గమనార్హం.