'Operation Sindoor 2.0: 'చైనా,టర్కీల మద్దతుతో పాక్ కవ్వింపు చర్యలు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పదనిపిస్తోంది: దుష్యంత్ సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
చైనా, టర్కీ మద్దతుతో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదేపదే రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో, భారత్ మరోసారి 'ఆపరేషన్ సిందూర్ 2.0' చేపట్టాల్సిన అవసరం తప్పదనే అభిప్రాయాన్ని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుశ్యంత్ సింగ్ వ్యక్తం చేశారు. ఇందుకు భారత సాయుధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ ల్యాండ్ వార్ఫేర్ స్టడీస్ (CLAWS) డైరెక్టర్ జనరల్గా ఉన్న దుశ్యంత్ సింగ్, గుజరాత్లోని సౌత్వెస్టర్న్ ఎయిర్ కమాండ్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం ఎంత త్వరగా సిద్ధమైతే అంత మంచిది
ఆపరేషన్ సిందూర్ సందర్భంగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ నిరంతరంగా ఉల్లంఘిస్తోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. "ఆపరేషన్ సిందూర్ ఒక ముగింపు కాదు. యుద్ధ నిర్వహణలో ఇది ఒక కొత్త దశకు ఆరంభం మాత్రమే. రాబోయే కాలంలో శత్రు దేశాలతో ఘర్షణలు తప్పవు. అందువల్ల, ఆపరేషన్ సిందూర్ 2.0 కోసం ఎంత త్వరగా సిద్ధమైతే అంత మంచిది" అని ఆయన అభిప్రాయపడ్డారు. ఆపరేషన్ సిందూర్ పాకిస్థాన్ లోపాలను స్పష్టంగా బయటపెట్టిందని, 1971 యుద్ధం తర్వాత భారత త్రివిధ దళాలు పూర్తి స్థాయి సమన్వయంతో పనిచేసిన తొలి సందర్భం అదేనని ఆయన గుర్తు చేశారు.
వివరాలు
ఆపరేషన్ సిందూర్ సమయంలో పెరిగిన సైబర్ దాడులు
అంతర్జాతీయ స్థాయిలో దేశ వ్యతిరేక ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో భారత్ ఇంకా వెనుకబడి ఉందని దుశ్యంత్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో ప్రభుత్వ నెట్వర్క్లపై సైబర్ దాడులు ఏడు రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు. ముఖ్యంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్పైనే సుమారు 40 కోట్ల సైబర్ దాడులు జరిగాయని వెల్లడించారు. ఇలాంటి ముప్పులను ఎదుర్కొనడం, తప్పుడు సమాచారాన్ని గుర్తించడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను వినియోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. అలాగే దేశ రక్షణ రంగానికి జీడీపీలో కనీసం 3 శాతం నిధులు కేటాయించడంతో పాటు, నిఘా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.