Page Loader
Skymet predicts:నైరుతి రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం.. ప్రైవేటు వాతావరణ సంస్థ 'స్కైమెట్‌' అంచనా
నైరుతి రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం

Skymet predicts:నైరుతి రుతుపవనాలకు పరిస్థితులు అనుకూలం.. ప్రైవేటు వాతావరణ సంస్థ 'స్కైమెట్‌' అంచనా

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 10, 2025
12:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ వ్యవసాయ రంగానికి ముఖ్యమైన పాత్ర పోషించే నైరుతి రుతుపవనాల సీజన్‌ ఈ ఏడాది సాధారణ స్థాయిలో వర్షాలు అందించనున్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్‌ అంచనా వేసింది. మార్చి వరకు ఉన్న వాతావరణ పరిస్థితులు, అనేక అంశాలపై విశ్లేషణలు చేసిన అనంతరం, స్కైమెట్ ఈ తాజా నివేదికను విడుదల చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉండే రుతుపవనాల కాలంలో దేశవ్యాప్తంగా సగటున 868.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందని సంస్థ పేర్కొంది. రుతుపవనాల ప్రారంభం నెమ్మదిగా జరిగినప్పటికీ, మధ్యకాలంలో వర్షాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.

వివరాలు 

దక్షిణాదిలో సమృద్ధిగా వర్షాలు 

భౌగోళిక ప్రాతిపదికన పరిశీలిస్తే, పశ్చిమ,దక్షిణ భారతదేశ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ కనుమలు, కేరళ, కర్ణాటక తీర ప్రాంతాలు, గోవా వంటి ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయి. అయితే, ఈశాన్య రాష్ట్రాలు మరియు ఉత్తర భారతంలోని కొండ ప్రాంతాల్లో సాధారణ స్థాయికి తక్కువ వర్షాలు పడే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో సాధారణం కంటే 30 శాతం అధిక వర్షపాతం కురిసే అవకాశముంది. అయితే ఈ ప్రాంతాలు మినహా మిగిలిన తెలుగు రాష్ట్రాల్లో సాధారణ స్థాయిలో వర్షాలు నమోదవుతాయని అంచనా. జులై నెలలో ఉమ్మడి అనంతపురం, కర్నూలు, విశాఖపట్నం,విజయనగరం,శ్రీకాకుళం జిల్లాలు తప్ప మిగతా ప్రాంతాల్లో తక్కువ వర్షాలు నమోదయ్యే అవకాశముంది.

వివరాలు 

మే నుంచి వర్షాలు 

ఇక ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మార్చి వరకు గల వాతావరణ పరిస్థితులను అనుసరించి, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ ఏడాది రుతుపవనాలపై ఏప్రిల్ 15 నాటికి అధికారిక బులెటిన్‌ను విడుదల చేయనుంది. ప్రస్తుతం తటస్థ స్థితిలో ఉన్న ఇండియన్ ఓషన్ డైపోల్‌ (ఐఓడీ) రుతుపవనాల ప్రారంభానికి ముందు పాజిటివ్‌ స్థితికి చేరుకునే అవకాశముంది. దీని ప్రభావంగా మే నెల నుంచే వర్షాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కె. జె. రమేష్, మాజీ డైరెక్టర్ జనరల్, ఐఎండీ తెలిపారు.

వివరాలు 

బలహీనపడిన అల్పపీడనం 

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బుధవారం నాటికి అల్పపీడనంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఉత్తర-ఆగ్నేయ దిశగా కదులుతూ గురువారం నాటికి మరింత బలహీనపడుతుందని పేర్కొంది. ఈ వాతావరణ పరిణామాల మధ్య, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే నాలుగు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, పిడుగులు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.