
Telangana Cabinet: తెలంగాణాలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్?
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ కాంగ్రెస్లో గత ఏడాదిన్నరుగా వేచి చూస్తున్న క్యాబినెట్ విస్తరణ, ఎనిమిది నెలలుగా ఎదురుచూస్తున్న పార్టీ కమిటీల నియామకానికి ఈ సారి ముహూర్తం ఫిక్సయ్యేలా ఉంది.
ఇప్పటివరకు అనేకసార్లు వాయిదా పడిన ఈ విషయాలపై ఈసారి పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
క్యాబినెట్ విస్తరణ, పార్టీ కమిటీల ఏర్పాటు వెనుక ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్తో పాటు మరో కీలక నాయకుడి చొరవ ముఖ్యపాత్ర పోషించిందన్న మాట గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది.
ముఖ్యంగా రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ఈ వ్యవహారాన్ని చాలా తీవ్రంగా తీసుకున్నారని, ఆమె ప్రతిజ్ఞ చేసిన నేపథ్యంలో కమిటీల ఏర్పాటు, మంత్రివర్గ విస్తరణ అమలవుతాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
వివరాలు
పీసీసీ పదవుల భర్తీకి స్పష్టత
ఇప్పటివరకు ఈ ప్రక్రియలో అనేక మలుపులు తిరిగింది. సామాజిక సమీకరణలు కుదరకపోవడం, కీలక నాయకుల వ్యక్తిగత ధోరణులు, పట్టింపులు వల్ల కొలిక్కిరాలేదు. పలుసార్లు ఈ వ్యవహారాన్ని సెట్ చేసేందుకు అధిష్టానం ప్రయత్నించినా ఫలించలేదు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ముఖ్యనాయకులను ఢిల్లీకి పిలిపించి హైకమాండ్ చర్చలు జరిపినా, మంత్రివర్గ విస్తరణకూ, పీసీసీ పదవుల భర్తీకి స్పష్టత రాలేదు.
దీంతో ఇకపై ఈ ప్రక్రియ ముందుకెళ్లదేమోనని అనేకులు నిరాశ చెందారు.
అయితే మీనాక్షి నటరాజన్ చేసిన ప్రతిజ్ఞ కారణంగా ఈ సమస్యలు ఒక్కొటీగా పరిష్కారం అవుతున్నాయని సమాచారం.
వివరాలు
మీనాక్షి నటరాజన్కు చికాకు?
క్యాబినెట్ విస్తరణ,రాష్ట్ర కమిటీల నియామకం అంశాన్ని మీనాక్షి నటరాజన్ అత్యంత కీలకంగా తీసుకున్నారని చెబుతున్నారు.
ఆమె ప్రతిసారి హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆశావహులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.
ఇటీవల ఏఐసీసీ నిర్వహించిన "జై బాపూ, జై భీమ్" కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై మీనాక్షి నేతృత్వంలో జరిగిన సమావేశాల్లోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్టు సమాచారం.
దీంతో ఆమెకు చికాకు పుట్టిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.ఈ నేపథ్యంలో,క్యాబినెట్ విస్తరణ,పార్టీ కమిటీల ఏర్పాట్లు పూర్తయ్యే వరకు తాను హైదరాబాద్కి రానని మీనాక్షి నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.
వివరాలు
నియామకాలు పూర్తిచేయకపోతే.. పని చేయలేను
సుమారు నెల రోజులుగా ఆమె తెలంగాణ అంశాలపై స్పందించకపోవడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకుంటున్నారు.
ఆమె పార్టీ అధిష్టానానికి కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా తెలిపారని, నియామకాలు పూర్తిచేయకపోతే తాను పని చేయలేనని హైకమాండ్కు వివరించినట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఈసారి ఏ పరిస్థితుల్లోనైనా ప్రక్రియను పూర్తి చేయాలనే ధృఢ సంకల్పంతో ఉన్నట్టు సమాచారం.
వివరాలు
ఇంతకీ క్యాబినెట్ విస్తరణ జరిగేనా?
రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ తీసుకున్న దీటైన నిర్ణయంతో, ఇప్పటివరకు అడ్డంకిగా ఉన్న క్యాబినెట్ విస్తరణ, పార్టీ కమిటీల నియామకానికి మార్గం సుగమమవుతుందని అంచనా.
సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండి అన్ని సామాజిక, రాజకీయ సమీకరణాలను సర్దుబాటు చేస్తున్నారని సమాచారం.
జూన్ 2వ తేదీకి ముందుగా, ఈ నెలాఖరులోనే మంత్రివర్గ విస్తరణతో పాటు పీసీసీ పదవుల భర్తీ ప్రక్రియ కూడా పూర్తవుతుందని గాంధీభవన్ వర్గాలు అంటున్నాయి.
ఈసారి అయినా క్యాబినెట్ విస్తరణకు అంతిమంగా గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిన విషయంగా మారింది.