ట్యాబ్స్ కన్నా ముందు టాయిలెట్స్ ఉండాలి: బైజూస్ కాంట్రాక్ట్పై పవన్ ప్రశ్నలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుసగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించారు. నిన్నటి వరకు వాలంటీర్ల వ్యవస్థ మీద ప్రశ్నలు గుప్పించిన జనసేనాని, తాజాగా బైజూస్తో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకున్న కాంట్రాక్ట్ పై ప్రశ్నలు కురిపించారు. ఇప్పటివరకు మెగా డీయస్సీ నోటిఫికేషన్, టీచర్ రిక్రూట్మెంట్ లేవని, టీచర్లకు శిక్షణ లేదని, కానీ తీవ్ర నష్టల్లో ఉన్న బైజూస్ కంపెనీతో కోట్ల రూపాయల కాంట్రాక్ట్ని వైసీపీ ప్రభుత్వం కుదుర్చుకుందని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అసలు నష్టాల్లో కంపెనీతో కాంట్రాక్ట్ ని ఎలా కుదుర్చుకున్నారని, టెండర్లకు ఏయే కంపెనీలు వచ్చాయో చెప్పాలని, ఏయే కంపెనీలను షార్ట్ లిస్ట్ చేసారో తెలియజేయాలని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసారు.
ట్యాబ్స్ కన్నా టాయిలెట్స్ ముఖ్యం
అంతేకాదు, బైజూస్తో కుదుర్చుకున్న కాంట్రాక్ట్ వివరాలు జనాలకు అందుబాటులో ఉన్నాయా అని ప్రశ్నించారు. ఈ ట్వీట్లో బైజూస్ కు సంబంధించిన కొన్ని ఆర్టికల్స్, ఫోటోలను జతచేసారు. కరోనా సమయంలో ఆన్లైన్ విద్య ద్వారా పుంజుకున్న బైజూస్, ఆ తర్వాత ఏ విధంగా నష్టాల్లోకి వెళ్ళిందో తెలియజేసే ఫోటోలను ఈ ట్వీట్ లో జతపరిచారు. ఇంకా, ట్యాబ్స్ ముఖ్యమేననీ, కానీ, దానికన్నా ముందు టాయిలెట్స్ బాగుండాలనీ, యాప్స్ అనేది ఒక ఛాయిస్ మాత్రమేననీ, టీచర్లు కచ్చితంగా అవసరమని, ఆన్ లైన్ విద్యకు తానేమీ వ్యతిరేకం కాదన్నట్టుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.