Pawan Kalyan:ఫ్లెమింగోలను శాశ్వత అతిథులుగా మార్చే దిశగా ప్రభుత్వం అడుగులు
ఈ వార్తాకథనం ఏంటి
తిరుపతి జిల్లాలోని పులికాట్ సరస్సు ఉప్పునీటితో పాటు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే సైబీరియన్ పక్షుల వల్ల కూడా ప్రసిద్ధి పొందింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా శీతాకాలం రాగానే విదేశీ అతిథులు పులికాట్ చేరుకోవడం మొదలైంది. దీంతో అక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్ వేడుకలు సందడిగా ప్రారంభమయ్యాయి.మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాదిమంది పక్షి ప్రియులు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ,అక్టోబర్లో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లే ఈ విదేశీ అతిథులు పులికాట్ ప్రాంతానికి ప్రత్యేక అందాన్నిఅందిస్తున్నారని తెలిపారు. ఫ్లెమింగోలకు పులికాట్ను శాశ్వత నివాసంగా మార్చేందుకు అనుకూల వాతావరణం సృష్టించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.
వివరాలు
ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రయత్నం
భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఎకో టూరిజం అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా, ఫ్లెమింగోలు ఇక్కడ స్థిరంగా నివాసం ఏర్పరుచుకునేలా అటవీశాఖ ఆధ్వర్యంలో అనుకూల పరిస్థితులు కల్పిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఫ్లెమింగోల ఆహారం, విశ్రాంతి, భద్రతకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకుంటున్న చర్యలు సానుకూల ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ఈసారి మూడు రోజుల పండుగతోనే ఆగిపోకుండా, ఎకో టూరిజాన్ని విస్తరించే ప్రయత్నంలో భాగంగా ఫోటోగ్రఫీ, బర్డ్ సీయింగ్, ఎకో క్లబ్ పేరుతో పలు కార్యక్రమాలను ప్రారంభించామని వెల్లడించారు.