Sonia Gandhi: సోనియా గాంధీ మెమోయిర్ ప్రచురణ నుంచి తప్పుకున్న పెంగ్విన్ ఇండియా
ఈ వార్తాకథనం ఏంటి
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం. పుస్తకంలోని ఓ భాగంలో ప్రచురణ సంస్థ సూచించిన కొన్ని ''సంపాదకీయ మార్పులు, తొలగింపుల''పై సోనియా గాంధీ అంగీకరించకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకున్నట్లు 'ది ఇండియన్ ఎక్స్ప్రెస్' పేర్కొంది.
వివరాలు
రంగంలోకి హార్పర్కాలిన్స్
పెంగ్విన్ ఇండియా తప్పుకోవడంతో సోనియా గాంధీ మెమోయిర్ను ప్రచురించే అవకాశం కోసం ఇతర ప్రచురణ సంస్థలు ప్రయత్నిస్తున్నాయి.
ఇందులో భాగంగా హార్పర్కాలిన్స్ ఇండియా ఈ పుస్తకాన్ని ప్రచురించి, పంపిణీ చేసేందుకు ఒప్పందాన్ని దాదాపు ఖరారు చేసే దశకు చేరుకున్నట్లు సమాచారం.
తొలుత ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్కు చెందిన ఆల్ఫ్రెడ్ ఏ. నాఫ్ సంస్థ ద్వారా నవంబర్ 10న అంతర్జాతీయంగా విడుదల చేయాలని నిర్ణయించారు.
మొదటి ముద్రణగా లక్ష కాపీలను సిద్ధం చేయాలని భావించారు.
వివరాలు
పుస్తకంలో ఏముంటుంది?
'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'లో సోనియా గాంధీ జీవితంలోని అనేక ముఖ్య ఘట్టాలను ప్రస్తావించే అవకాశం ఉంది.
యుద్ధానంతర ఇటలీలో ఆమె చిన్ననాటి జీవితం నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీతో వివాహం వరకు జరిగిన పరిణామాలను ఇందులో వివరించనున్నట్లు తెలుస్తోంది.
అలాగే సంజయ్ గాంధీ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీల మరణాలతో ఆమె ఎదుర్కొన్న విషాద పరిస్థితుల గురించి కూడా పుస్తకంలో ప్రస్తావించనున్నట్లు సమాచారం.
ప్రజా జీవితంలోకి ఆమె ప్రవేశించడం, 2004 లోక్సభ ఎన్నికల తర్వాత ప్రధాని పదవిని చేపట్టకూడదని తీసుకున్న నిర్ణయం వంటి అంశాలు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.
వివరాలు
''మెమోయిర్ రాయడం వల్ల నా ఏకాంత జీవితం నుంచి బయటకు వచ్చాను''
పుస్తకాన్ని ప్రకటిస్తూ ప్రచురణ సంస్థ విడుదల చేసిన ప్రకటనలో సోనియా గాంధీ తన రచన గురించి మాట్లాడారు.
తన కుటుంబం గురించి ఎన్నో విషయాలు రాశారని, అయితే వారి నిర్ణయాలు, చర్యలు, మానవీయ బలహీనతలకు సంబంధించిన అసలు కారణాలను కొద్దిమంది మాత్రమే వివరించగలిగారని ఆమె పేర్కొన్నారు.
తాను ఆరు దశాబ్దాలుగా చూసిన సామాజిక, రాజకీయ మార్పులను కూడా తన కథ పాఠకులకు ప్రత్యేకమైన కోణంలో చూపిస్తుందని చెప్పారు.
దశాబ్దాలుగా కొనసాగించిన వ్యక్తిగత ఏకాంతం నుంచి ఈ మెమోయిర్ రచన తనను బయటకు తీసుకొచ్చిందని సోనియా తెలిపారు.
వివరాలు
తల్లి పుస్తకంపై రాహుల్ గాంధీ ఏమన్నారు?
సోనియా గాంధీ మెమోయిర్పై రాహుల్ గాంధీ గతంలో స్పందించారు.
తన తల్లి తన జీవిత కథను పంచుకునేందుకు చూపిన ధైర్యాన్ని ఆయన ప్రశంసించారు.
సోనియాను ''మామా'' అని సంబోధిస్తూ.. 1991లో రాజీవ్ గాంధీ హత్య తర్వాతి రోజులను గుర్తుచేసుకున్నారు.
"పాపా వెళ్లిపోయిన రోజు నుంచి మీ జీవితంలో ఎదురైన ప్రతి కష్టాన్ని మీరు ఎంతో ధైర్యంగా, గౌరవంగా ఎదుర్కోవడం చూశాను'' అని రాహుల్ పేర్కొన్నారు
రాజీవ్ గాంధీ మరణం తర్వాత సోనియా ఎదుర్కొన్న పరిస్థితులను తాను, ప్రియాంక మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలమని ఆయన అన్నారు.