Loading...
PM Modi: పేపర్‌ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం.. క్యాబినెట్‌లో ముసాయిదా బిల్లుపై చర్చ
పేపర్‌ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం.. క్యాబినెట్‌లో ముసాయిదా బిల్లుపై చర్చ

PM Modi: పేపర్‌ లీక్‌లపై కేంద్రం కఠిన చట్టం.. క్యాబినెట్‌లో ముసాయిదా బిల్లుపై చర్చ

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 24, 2026
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీక్‌ ఘటనలు కలకలం రేపుతున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది. పేపర్‌ లీక్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ నేపథ్యంలో శుక్రవారం కేంద్ర క్యాబినెట్‌ సమావేశమైంది. ప్రధాని అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరీక్షల ప్రశ్నపత్రాల లీక్‌లను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో రూపొందించిన ముసాయిదా బిల్లుపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. పరీక్షల అక్రమాలను నియంత్రించేందుకు కఠిన శిక్షలు విధించడం,కేసుల వేగవంతమైన విచారణ కోసం ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయడం వంటి అంశాలను సమావేశంలో పరిశీలించారు. అలాగే,ఈ తరహా నేరాలకు పాల్పడే వారిపై మరింత కఠినంగా వ్యవహరించేలా చట్టపరమైన నిబంధనలను బలోపేతం చేసే దిశగా కూడా చర్చలు సాగాయి.

వివరాలు 

బిల్లుకు సంబంధించిన వివరాలను ప్రత్యేక వీడియో సందేశం ద్వారా వెల్లడించిన ప్రధాని

క్యాబినెట్‌ మంత్రులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ముసాయిదా బిల్లుకు తుదిరూపం ఇవ్వనున్నారు.

ఈ బిల్లుకు సంబంధించిన వివరాలను గురువారం అర్ధరాత్రి ప్రధాని నరేంద్రమోదీ ప్రత్యేక వీడియో సందేశం ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

ఈ చట్టాన్ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వచ్చే సోమవారం ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే అమల్లో ఉన్న 2024 ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టంలో పలు సవరణలు చేసి కొత్త బిల్లును తీసుకురానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమల్లో ఉన్న జైలు శిక్షలను మరింత కఠినతరం చేయడంతో పాటు, నేరస్తులపై భారీ జరిమానాలు విధించేలా చట్టంలో మార్పులు చేసే అవకాశముంది.

వివరాలు 

కేంద్రంతో సీజేపీ చర్చలు

ఇదిలా ఉండగా, కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం శుక్రవారం చర్చలు నిర్వహించింది.

దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో జరిగిన సమావేశంలో కేంద్ర మంత్రులు, సీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు.

నీట్‌ పరీక్షకు సంబంధించిన అంశాలతో పాటు దేశ విద్యా వ్యవస్థలో చేపట్టాల్సిన పలు సంస్కరణలపై ఇరు వర్గాలు చర్చించాయి.

అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేసే వరకు తమ ఆందోళనలను విరమించబోమని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే మరోసారి స్పష్టం చేశారు.

ADVERTISEMENT