LOADING...
CIC appointments: సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ
సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ

CIC appointments: సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 10, 2025
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమై కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) కీలక నియామకాలపై చర్చించారు. చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌ పదవి‌తో పాటు ఖాళీగా ఉన్న ఎనిమిది ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌ పోస్టులకు ఎంపికను ఖరారు చేయడమే ఈ సమావేశం లక్ష్యంగా సాగినట్టు సీఎన్‌ఎన్-న్యూస్18 వెల్లడించింది. ఈ నియామకాలను పరిశీలించే హై లెవల్ కమిటీని ఆర్‌టీఐ చట్టం సెక్షన్‌ 12(3) ప్రకారం ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఈ కమిటీకి చైర్మన్‌గా ఉండగా,విపక్ష నేతతో పాటు పీఎం నియమించిన ఒక కేంద్ర మంత్రి సభ్యులుగా ఉంటారు. పారదర్శకతను కాపాడే సంస్థ అయిన సీఐసీలో నియామకాలపై సిఫారసులు చేయడం ఈ కమిటీ బాధ్యత.

వివరాలు 

సీఐసీ వద్ద 30,838పెండింగ్‌ కేసులు 

నిబంధనల ప్రకారం సీఐసీలో ఒక చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌తో పాటు గరిష్టంగా 10మంది ఇన్‌ఫర్మేషన్ కమిషనర్లు ఉండాలి. అయితే ప్రస్తుతం కమిషన్‌లో కేవలం ఇద్దరే పని చేస్తున్నారు.అనందీ రామలింగం,వినోద్‌ కుమార్‌ తివారీ మాత్రమే విధులు నిర్వహిస్తుండగా,మరో ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తాజా లెక్కల ప్రకారం సీఐసీ వద్ద 30,838పెండింగ్‌ కేసులు ఉన్నట్టు సమాచారం. సెప్టెంబర్‌ 13న అప్పటి చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌ హీరాలాల్‌ సమరియా 65 ఏళ్ల వయస్సు పూర్తవడంతో పదవీ విరమణ చేయడంతో ఈ పోస్టు ఖాళీ అయింది. 2014 నుంచి ఇప్పటి వరకు ఇది ఏడోసారి సీఐసీ చీఫ్ లేకుండా కొనసాగుతున్న పరిస్థితి.తొలి సారి రాజీవ్‌ మాథూర్‌ రిటైర్ అయిన ఆగస్టు 2014 తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది.

వివరాలు 

ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌ ఖాళీలకు 161 దరఖాస్తులు 

రిటైర్డ్ నేవీ అధికారి కమోడోర్‌ లోకేష్‌ బత్రా దాఖలు చేసిన ఆర్‌టీఐకి స్పందనగా, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీఓపీటీ) వివరాలు వెల్లడించింది. మే 21న విడుదల చేసిన నోటిఫికేషన్‌కు చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌ పోస్టుకు 83 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపింది. అలాగే ఆగస్టు 14న ఇచ్చిన ప్రకటనకు ఇన్‌ఫర్మేషన్ కమిషనర్‌ ఖాళీలకు 161 దరఖాస్తులు అందాయని తెలిపింది. నియామక ప్రక్రియలో భాగంగా డీఓపీటీ అన్ని దరఖాస్తులను సేకరించి, కేబినెట్‌ సెక్రెటరీ నేతృత్వంలోని సెర్చ్‌ కమిటీకి పంపిస్తుంది. ఆ కమిటీ సిఫారసులతో పాటు మొత్తం దరఖాస్తుల జాబితాను తిరిగి ప్రధాని నేతృత్వంలోని సెలెక్షన్‌ కమిటీ ముందు ఉంచుతారు. అక్కడ తుది ఎంపిక ఖరారైన తర్వాత, అధ్యక్షుడు ఆయా అభ్యర్థులను అధికారికంగా నియమిస్తారు.

Advertisement