Pm Modi: పశ్చిమ ఆసియా సంక్షోభం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. ఈ సంక్షోభం ప్రభావం చాలా కాలం పాటు కొనసాగవచ్చని,దీని నుంచి కోలుకోవడానికి సమయం పడుతుందని ఆయన తెలిపారు. మంగళవారం రాజ్యసభలో ప్రసంగించిన మోదీ, మూడు వారాలకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధం ఇప్పటికే ఇంధన సంక్షోభానికి దారితీసిందని, ముఖ్యమైన వాణిజ్య మార్గాలను దెబ్బతీసిందని చెప్పారు. "ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఇంధన సమస్యను సృష్టించింది.భారతదేశానికి కూడా ఇది ఆందోళనకరమే. మన వాణిజ్య మార్గాలపై ప్రభావం పడింది.దీనివల్ల పెట్రోల్,డీజిల్,గ్యాస్,ఎరువుల సరఫరా సాధారణంగా సాగడంలో అంతరాయం ఏర్పడింది" అని ఆయన అన్నారు. భారత ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తూ,ప్రభావాన్ని తగ్గించేందుకు నిరంతరం చర్యలు తీసుకుంటోందని మోదీ స్పష్టం చేశారు.
వివరాలు
దీర్ఘకాల ప్రభావం ఉండొచ్చు
"మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. ప్రతి మారుతున్న పరిస్థితిని ప్రభుత్వం గమనిస్తూ, అత్యంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటోంది" అని తెలిపారు. "ఈ సంక్షోభం భిన్నమైనది. దీని పరిష్కారాలూ భిన్నంగానే ఉండాలి. ప్రతి సవాలును సహనం, నియంత్రణ, ప్రశాంతమైన మనస్సుతో ఎదుర్కోవాలి" అని ఆయన అన్నారు. ఈ యుద్ధ ప్రభావం దీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రధాని హెచ్చరించారు. "ఈ యుద్ధం ప్రతికూల ప్రభావం చాలా కాలం పాటు ఉంటుంది" అని చెప్పిన ఆయన, దేశ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం అప్రమత్తంగా, సిద్ధంగా, పూర్తి కట్టుదిట్టంగా పనిచేస్తోందని ప్రజలకు భరోసా ఇచ్చారు.
వివరాలు
రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలి.. నిల్వలు, బ్లాక్ మార్కెట్పై కఠిన చర్యలు
అత్యవసర వస్తువులపై బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను అరికట్టాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పేదలు, వలస కార్మికుల కోసం ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కోవిడ్ సమయంలో కేంద్ర-రాష్ట్రాలు కలిసి పనిచేసిన విధానాన్ని గుర్తు చేస్తూ, ప్రస్తుతం కూడా అదే "టీమ్ ఇండియా" స్పూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. "అత్యవసర వస్తువుల సరఫరా సజావుగా కొనసాగేందుకు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి" అని ఆయన అన్నారు.
వివరాలు
హోర్ముజ్ జలసంధిపై ఆందోళన
హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నౌకలు అక్కడ నిలిచిపోయాయని, వాటిలో భారతీయ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు. "హోర్ముజ్ జలసంధిలో అనేక నౌకలు నిలిచిపోయాయి. వాటిలో పెద్ద సంఖ్యలో భారతీయ సిబ్బంది ఉన్నారు" అని మోదీ చెప్పారు. భారత నౌకల సురక్షిత రాకపోకల కోసం దౌత్య మార్గాల్లో చర్యలు తీసుకుంటున్నామని, ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. "మా లక్ష్యం ఉద్రిక్తత తగ్గించడం, హోర్ముజ్ జలసంధిని మళ్లీ తెరవడం" అని అన్నారు.
వివరాలు
భారతీయుల భద్రతే మొదటి ప్రాధాన్యం
గల్ఫ్ దేశాల్లో దాదాపు ఒక కోటి మంది భారతీయులు నివసిస్తున్నారని ప్రధాని గుర్తుచేశారు. వారి భద్రత అత్యంత ప్రాధాన్యమని తెలిపారు. "దేశంలోనూ, విదేశాల్లోనూ ఉన్న భారతీయుల భద్రతే మా మొదటి ప్రాధాన్యం" అని చెప్పారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా తిరిగి వచ్చారని, అందులో ఇరాన్ నుంచి వచ్చిన 1,000 మందికి పైగా, వారిలో 700 మంది మెడికల్ విద్యార్థులు ఉన్నారని వెల్లడించారు.
వివరాలు
దౌత్య ప్రయత్నాలకు ప్రాధాన్యం
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో భారత్ నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని ప్రధాని తెలిపారు. "ఈ యుద్ధం వల్ల మానవ ప్రాణాలు ప్రమాదంలో పడటం మానవత్వానికి మంచిది కాదు. అందుకే అన్ని పక్షాలు శాంతి మార్గాన్ని ఎంచుకునేలా భారత్ నిరంతరం ప్రయత్నిస్తోంది" అని తెలిపారు. ఇటీవల అనేక ప్రపంచ నాయకులతో కూడా ఈ సంక్షోభంపై చర్చించినట్లు వెల్లడించారు.
వివరాలు
ఇంధన సరఫరా భద్రత, ఆత్మనిర్భర్ దిశగా అడుగులు
ఇంధన సరఫరాలో అంతరాయాలను ఎదుర్కొనేందుకు పలు మార్గాల ద్వారా చమురు, గ్యాస్ను సేకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాని తెలిపారు. "సాధ్యమైన అన్ని మార్గాల్లో గ్యాస్, క్రూడ్ ఆయిల్ను సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ చర్యలు కొనసాగుతాయి" అని చెప్పారు. గత 11 ఏళ్లలో భారత్ 53 లక్షల మెట్రిక్ టన్నుల వ్యూహాత్మక చమురు నిల్వలను ఏర్పాటు చేసిందని, అదనంగా 65 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని పెంచే పనులు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే రూ.70,000 కోట్ల నౌక నిర్మాణ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ, దేశం ఆత్మనిర్భర్గా మారాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు. "భారత్ ఆత్మనిర్భర్ కావడం తప్ప మరో మార్గం లేదు" అని అన్నారు.