Loading...
Narendra Modi: 30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్
30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్

Narendra Modi: 30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్

వ్రాసిన వారు Moogati Shabari
Jul 25, 2026
10:15 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. 2026 నీట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై విద్యార్థులను ఉద్దేశించి అర్ధరాత్రి సమయంలో ఆయన పోస్ట్ చేసిన జెన్-జీ (Gen Z) శైలిలోని సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో విడుదలైన కేవలం 24 గంటల్లోనే మోదీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు చేరారు. అంతేకాకుండా, అదే వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో 24 గంటల వ్యవధిలోనే 303 మిలియన్‌లు (దాదాపు 30.3 కోట్ల) వ్యూస్ సాధించి ప్రపంచవ్యాప్తంగా కొత్త రికార్డును నమోదు చేసింది.

వివరాలు

గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ..

దీంతో 2026 ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా రూపొందించిన ప్రముఖ స్ట్రీమర్ 'ఐషో స్పీడ్' వీడియోకు ఉన్న 300 మిలియన్ (30 కోట్ల) వ్యూస్ రికార్డు వెనక్కి వెళ్లిపోయింది.

ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో 100 మిలియన్‌లకు పైగా (సుమారు 10.2 కోట్ల) ఫాలోవర్లతో ప్రపంచ నాయకుల్లో అత్యధిక ఫాలోవర్లు కలిగిన గ్లోబల్ లీడర్‌గా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు.

ఇదిలా ఉండగా, ఆయన అర్ధరాత్రి విడుదల చేసిన ఈ వీడియో ఆధారంగా నెటిజన్లు పెద్దఎత్తున రీల్స్ రూపొందిస్తున్నారు.

ముఖ్యంగా ప్రసంగాన్ని "ఫ్రెండ్స్" అంటూ ప్రారంభించి, జెన్-జీ తరానికి దగ్గరైన భాషలో మాట్లాడటం యువతను విశేషంగా ఆకట్టుకుంది.

మోదీ అనుసరిస్తున్న ఈ కొత్త సోషల్ మీడియా శైలి జెన్-జీ ప్రేక్షకులతో మరింత అనుబంధాన్ని పెంచుతోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు

ప్రజలకు మరింత చేరువ..

ఇదిలా ఉండగా, ప్రశ్నాపత్రాల లీకేజీలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ గురువారం విడుదల చేసిన ఈ వీడియోకు విద్యార్థుల నుంచి వచ్చిన విశేష స్పందనపై ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేశారు.

స్పందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన మరో వీడియోను కూడా విడుదల చేశారు.

అంతకుముందు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, ప్రతి మంత్రి సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉండాలని, యువతతో నిరంతరం మమేకమవుతూ ప్రజలకు చేరువ కావాలని ప్రధాని మోదీ సూచించినట్లు సమాచారం.

ADVERTISEMENT