PM Modi surrender: పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళన.. 'పీఎం మోడీ సరెండర్' అంటూ నినాదాలు
ఈ వార్తాకథనం ఏంటి
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. సమావేశాల ప్రారంభంలో, 2025 డిసెంబర్ 24న మరణించిన సురూప్సింగ్ హిర్యా నాయక్కు స్పీకర్ ఓం బిర్లా సభ తరఫున సంతాపం తెలియజేశారు. అనంతరం సభలో ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా విషయంలో "సరెండర్ అయ్యారు" అంటూ కాంగ్రెస్ ఎంపీలు నిరసనకు దిగారు. నినాదాలు చేస్తూ స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లారు. అమెరికాతో కుదిరే ట్రేడ్ డీల్ అంశంపై ప్రధాని వెంటనే ప్రకటన చేయాలని కాంగ్రెస్ సభ్యులు గట్టిగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత,ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ,2025 మే 10న జరిగిన పరిణామాల్లాగే ఈసారి కూడా ప్రధాని మోదీ అమెరికాకు పూర్తిగా లొంగిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
వివరాలు
వరుస నిరసనల నేపథ్యంలో లోక్ సభ వాయిదా
ఆయన ఖచ్చితంగా ట్రంప్ ను శాంతిపంజేశారని ఆరోపించారు. ఇలాంటి దురదృష్టకర ఘటనలు పదేపదే జరుగుతుండటంతో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ఠ దిగజారుతోందని ఆయన విమర్శించారు. దీనిపై స్పందించిన సభ ఛైర్మన్ రాధాకృష్ణన్, ఈ అంశంపై తగిన సమయంలో చర్చ చేపడతామని తెలిపారు. ఇదిలా ఉండగా, సోమవారం ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, 2020లో భారత్-చైనా సరిహద్దు వివాదానికి సంబంధించిన అంశాలను మాజీ ఆర్మీ చీఫ్ నరవణే విడుదల చేసిన ఆత్మకథలో ప్రస్తావించారని సభలో లేవనెత్తారు. దీనితో సభలో మరింత గందరగోళం ఏర్పడింది. ఈ అంశాన్ని కేంద్రంగా చేసుకుని కూడా ఆందోళనలు కొనసాగాయి. వరుస నిరసనల నేపథ్యంలో సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది.