
Trump-Modi: ఫిబ్రవరి 13న వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ప్రధాని మోదీ చర్చలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 12 నుండి రెండు రోజుల పాటు అమెరిలో పర్యటించనున్నారు. అక్కడ ఆయన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫిబ్రవరి 13న భేటీ కానున్నారు. ఈ సమాచారాన్ని అధికారిక వర్గాలు మీడియాకు సూచనప్రాయంగా వెల్లడించాయి. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత,ప్రధాని మోదీ తొలిసారి ఆయనను కలుసుకోనున్నారు. 2024 నవంబర్లో అమెరికాలో జరిగిన ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ట్రంప్ 2025,జనవరి 20న రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ట్రంప్ పరిపాలన అధికారంలోకి వచ్చిన కొన్ని వారాల్లో, ద్వైపాక్షిక పర్యటన కోసం వాషింగ్టన్ డీసీని సందర్శించనున్న కొద్దిమంది విదేశీ నాయకుల్లో ప్రధాని మోదీ కూడా ఉన్నారు. అయితే, ప్రధాని మోదీ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
వివరాలు
అమెరికా నుంచి పౌర అణు సహకారం
విదేశాంగ మంత్రిత్వ శాఖ(ఎంఈఏ)ఇటీవల ప్రధాని మోదీ అమెరికా పర్యటనపై వాషింగ్టన్ అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు ప్రకటించింది. వలసలపై, సుంకాలపై అమెరికా అధ్యక్షుని అభిప్రాయాలపై భారతదేశంలో ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో,ప్రధాని మోదీ అమెరికా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్, కెనడా, మెక్సికన్ దిగుమతులపై 25శాతం సుంకాన్ని,చైనా వస్తువులపై అదనంగా 10శాతం సుంకాన్ని ఇటీవల ప్రకటించారు. జనవరి 27న, ప్రధానమంత్రి మోదీ, ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలో వాణిజ్యం,ఇంధనం,రక్షణ రంగాలలో భారతదేశం-అమెరికాలు భాగస్వామ్యంతో పనిచేయాలనే అభిలాషను వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ,అమెరికా పర్యటనకు ముందు,భారత్ అణు బాధ్యత చట్టాన్ని సవరించడానికి,అణుశక్తి మిషన్ను ఏర్పాటు చేయడానికి తన ప్రణాళికలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో,అమెరికా నుంచి పౌర అణు సహకారం అందుకునేందుకు భారత్ ఎదురు చూస్తున్నట్లు పేర్కొంది.