Tamil Nadu: తమిళనాడులో రాజకీయ కలకలం.. విజయ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు 'ప్రాజెక్టు మేఘాలయ'
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఇటీవల అధికారంలోకి వచ్చిన జోసెఫ్ విజయ్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు 'ప్రాజెక్ట్ మేఘాలయ' పేరుతో కుట్ర పన్నినట్లు రాష్ట్ర పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే ఈ ఆపరేషన్కు 'ప్రాజెక్ట్ మేఘాలయ' అనే పేరు ఎందుకు పెట్టారనే అంశంపై పోలీసులు ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టేందుకు టీవీకే (TVK)కు చెందిన సుమారు 15 మంది ఎమ్మెల్యేలకు భారీ మొత్తంలో డబ్బు ఆఫర్ చేసినట్లు ఆరోపణలున్నాయి. విప్ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రతి ఎమ్మెల్యేకు రూ.35 కోట్ల చొప్పున ఆఫర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారం కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వెలుగులోకి వచ్చినట్లు వెల్లడించారు.
వివరాలు
దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఫిర్యాదు అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ సన్నిహితుడు, కరూర్కు చెందిన డీఎంకే నాయకుడు కార్తి, ఓ ఫైనాన్స్ సంస్థ యజమాని రమేష్తో పాటు మొత్తం తొమ్మిది మందిని శుక్రవారం అరెస్టు చేశారు.
ఇక దర్యాప్తులో భాగంగా ఐపీడీఎస్(IPDS)అనే ఒపీనియన్ పోల్ గ్రూప్తో పాటు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు తిరునావుక్కరసును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం విజయన్ అనే జర్నలిస్టు తిరునావుక్కరసుకు ఎస్ఎంఎస్లు పంపుతూ 'ప్రాజెక్ట్ మేఘాలయ'కు సహకరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
విజయన్ను రెండు రోజుల పాటు చెన్నైలోని ట్రిప్లికేన్ ప్రాంతంలో విచారించిన పోలీసులు, అతని సెల్ఫోన్ను సైబర్ నిపుణుల పరిశీలన కోసం పంపించారు.