LOADING...
Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ
మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ

Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 12, 2026
01:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు. బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తీసుకుంటున్న చర్యగా కనిపిస్తోందని ఖర్గే విమర్శించారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు.

వివరాలు

ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదు

ఏప్రిల్ 16 నుంచి 'నారీ శక్తి వందన్ అధినియమ్'పై చర్చించేందుకు ఏర్పాటు చేసిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశంపై ప్రధాని పంపిన లేఖ తనకు అందిందని ఖర్గే తెలిపారు. 2023 సెప్టెంబర్‌లో ఈ చట్టాన్ని పార్లమెంట్ ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ, వెంటనే అమలు చేయాలని తాను అప్పుడే డిమాండ్ చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడు ఈ చట్టం అమలుకు విస్తృత ఏకాభిప్రాయం ఉందని చెబుతున్న ప్రభుత్వం, ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. ఇటీవల ప్రధాని మోదీ, ఏప్రిల్ 16 నుంచి ఈ చట్టంపై చర్చించేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ఖర్గేకు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖకు ఖర్గే తాజాగా సమాధానం ఇచ్చారు.

వివరాలు

30 నెలలు గడిచినా అమలు కాలేదు

నారీ శక్తి వందన్ అధినియమ్ పార్లమెంట్‌లో ఆమోదం పొందినప్పటి నుంచి 30 నెలలు గడిచాయని ఖర్గే పేర్కొన్నారు. ఇప్పుడేమో ప్రతిపక్షాలను సంప్రదించకుండానే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారని విమర్శించారు. అదనంగా, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన ఎలాంటి వివరాలు వెల్లడించకుండా మళ్లీ తమ సహకారం కోరడం సరైంది కాదన్నారు. ఈ చట్టంతో ముడిపడి ఉన్న కీలక అంశాలపై స్పష్టత లేకుండా అర్థవంతమైన చర్చ జరగదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపిందన్న ప్రధాని వ్యాఖ్యను ఖర్గే ఖండిస్తూ, అది నిజం కాదన్నారు. బెంగాల్ ఎన్నికలు 2026 ఏప్రిల్ 29న ముగుస్తాయని, ఆ తర్వాత రాజ్యాంగ సవరణలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరిన విషయాన్ని గుర్తుచేశారు.

Advertisement

వివరాలు

అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలి

ఎన్నికల సమయంలోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం మహిళల సాధికారత కంటే రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తోందన్న అనుమానాలను బలపరుస్తోందని ఖర్గే విమర్శించారు. నోట్ల రద్దు, జీఎస్టీ, జనాభా లెక్కలు, ఆర్థిక సంఘం సిఫార్సులు, పన్నుల వంటి అంశాల్లో ప్రభుత్వ గత పనితీరు నమ్మకం కలిగించలేదని ఖర్గే ఆరోపించారు. ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలు కేంద్రం, రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఎంత చిన్న మార్పైనా అన్ని పార్టీలకు, రాష్ట్రాలకు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఇవ్వడం అత్యంత అవసరమని అన్నారు. ప్రధాని తన లేఖలో ఈ ప్రత్యేక సమావేశం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికేనని పేర్కొన్న విషయాన్ని ఖర్గే గుర్తు చేశారు.

Advertisement

వివరాలు

ఎప్పుడైనా అఖిలపక్షం ఏర్పడే అవకాశం

నియోజకవర్గాల పునర్విభజన వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 29 తర్వాత ఎప్పుడైనా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ చట్టం పేరుతో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని కాంగ్రెస్ ఇప్పటికే ఆరోపించింది. ఈ చట్టానికి అనుసంధానంగా ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని కూడా విమర్శించింది. దీని వల్ల తీవ్రమైన పరిణామాలు తలెత్తే అవకాశముందని పేర్కొంది. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, ఖర్గే ప్రధానికి రాసిన లేఖను సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పంచుకున్నారు. తమిళనాడు, బెంగాల్ ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనగా ఉందని ఖర్గే లేఖలో పేర్కొన్నారని వెల్లడించారు.

Advertisement