PM Modi vs Mamata Banerjee: శ్రీరామ నవమి వేడుకలపై పశ్చిమ బెంగాల్ లో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం
శ్రీరామ నవమి (Sri Rama Navami) వేడుకలపై పశ్చిమ బెంగాల్(West Bengal)లో బీజేపీ(BJP),టీఎంసీ (TMC) ల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. రాష్ట్రంలో శ్రీరామ నవమి వేడుకులను మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందని ప్రధాని మోదీ (Modi)ఆరోపించారు. దీనికి తీవ్రంగా స్పందించిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ...రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. అధికారుల బదిలీలు సాధారణమేనని,అధికారుల బదిలీ వ్యవహారాల్లోకి బీజేపీ జోక్యం చేసుకోవడం సరికాదని హితవు చెప్పారు. ప్రధాని మోదీ రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. అధికారుల బదిలీ వ్యవహారంలో బీజేపీ జోక్యం వల్ల ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే ఆ పార్టీనే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
ఊరేగింపుకి కలకత్తా హైకోర్టు అనుమతి..
శ్రీరామ నవమి సందర్భంగా హౌరా సిటీలో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ)కి ఊరేగింపు నిర్వహించుకునేందుకు కలకత్తా హైకోర్టు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. గతేడాది ఊరేగింపులో అవాంఛనీయ ఘటనలు జరగడంతో వేరే మార్గాల్లో ఊరేగింపు నిర్వహించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. దీనిపై వీహెచ్ పీ కోర్టుకెళ్లిన సంగతి తెలిసిందే. మంగళవారం బాలూరు ఘాట్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు.
ముర్షీదాబాద్ ఐజీని బదిలీ
అయోధ్యలోని రామ్లల్లా ఆలయంలో శ్రీరామ నవమి వేడుకలు జరపడం తొలిసారని పేర్కొన్నారు. శ్రీరామ నవమి వేడుకల్ని అడ్డుకునేందుకు టీఎంసీ ప్రయత్నిస్తోందని, అందుకోసం ఆ పార్టీ అనేక కుట్రలకు తెరతీస్తుందని చివరికి సత్యమే విజయం సాధిస్తుందని తెలిపారు. కాగా శ్రీరామ నవమి వేడుకలను అడ్డుగా పెట్టుకుని బీజేపీ మత ఘర్షణలకు కుట్రపన్నుతుందని, ఫలితంగా ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని ఆశిస్తున్నట్లు మమతా బెనర్జీ విమర్శించారు. మత ఘర్షణలు చెలరేగే అవకాశం ఉన్నందునే ముర్షీదాబాద్ ఐజీని బదిలీ చేసినట్లు తెలిపారు. అక్కడ ఏమైనా అల్లర్లు జరిగితే అక్కడ దానికి ఎన్నికల కమిషనే బాధ్యత తీసుకోవాలని మమతాబెనర్జీ చెప్పారు.