Pm Modi: యూసీసీ, వన్ నేషన్-వన్ ఎలక్షన్పై సానుకూల చర్చలు జరుగుతున్నాయి: ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ఉమ్మడి పౌరస్మృతి (UCC), వన్ నేషన్-వన్ ఎలెక్షన్ అంశాలపై తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పార్టీ అమలు చేయాల్సిన కీలక ఎజెండాల్లో ఇవి ఇంకా మిగిలి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశాలపై దేశ ప్రజల్లో కూడా సీరియస్ చర్చ జరుగుతోందని అన్నారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా వర్చువల్గా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన మోదీ, గతంలో కాంగ్రెస్ పాలనలో బీజేపీ కార్యకర్తలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వారిని లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. ముఖ్యంగా బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పలువురు బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. అక్కడ హింస రాజకీయ సంస్కృతిగా మారిందని విమర్శించారు.
వివరాలు
లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి ఎన్నికలు
తమ పార్టీ లక్ష్యాలు ఇంకా కొనసాగుతున్నాయని, యూసీసీతో పాటు వన్ నేషన్-వన్ ఎలెక్షన్ అంశాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఈ దిశగా సానుకూలంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వన్ నేషన్-వన్ ఎలెక్షన్ విధానం కింద లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రణాళిక ఉంటుంది. ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలులోకి వస్తే, మత భేదాలు లేకుండా వివాహం, దత్తత వంటి అంశాల్లో అందరికీ ఒకే విధమైన చట్టం అమల్లోకి వస్తుంది. ప్రతి సవాలును ఎదుర్కొనేందుకు బీజేపీ కట్టుబడి పనిచేస్తోందని ప్రజలు గుర్తించారని మోదీ అన్నారు. గతంలో పలు కీలక నిర్ణయాలతో సానుకూల ఫలితాలు సాధించామని, భవిష్యత్తులోనూ అదే దిశగా ముందుకు సాగుతామని తెలిపారు.
వివరాలు
ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం
బ్రిటిష్ కాలం నాటి వందల సంఖ్యలో ఉన్న పాత చట్టాలను రద్దు చేశామని, ప్రజాస్వామ్య పద్ధతిలో కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించామని చెప్పారు. జనరల్ కేటగిరీలో ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం, ట్రిపుల్ తలాక్ రద్దు, పౌరసత్వ సవరణ చట్టం అమలు, అయోధ్యలో రామాలయం నిర్మాణం వంటి అంశాలు తమ ప్రభుత్వం సాధించిన విజయాలుగా పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తలు పార్టీని తల్లి లాగా భావిస్తారని, వ్యవస్థాపక దినోత్సవం కేవలం రాజకీయ కార్యక్రమం కాకుండా భావోద్వేగానికి సంబంధించినదని మోదీ తెలిపారు.