Fact check:పోస్టాఫీస్ రూ.20వేల సబ్సిడీ పేరిట మోసం..ఆ లింక్ క్లిక్ చేయొద్దు!
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ పోస్టాఫీస్ పేరిట సోషల్ మీడియాలో మరో మోసపూరిత ప్రచారం వెలుగుచూసింది. చఠ్ పూజ సందర్భంగా పోస్టల్ శాఖ సబ్సిడీ లేదా లక్కీ డ్రా రివార్డులు అందిస్తోందని చెబుతూ ఒక తప్పుడు మెసేజ్ వివిధ ప్లాట్ఫామ్లలో చక్కర్లు కొడుతోంది. అయితే, ఈ సమాచారం పూర్తిగా అవాస్తవమని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB)స్పష్టం చేసింది. PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం వెల్లడించిన వివరాల ప్రకారం సైబర్ నేరగాళ్లు ఈ నకిలీ సందేశాల ద్వారా ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో వాటిని వ్యాపింపజేస్తున్నారు. ఆమెసేజ్ల్లో ఇచ్చిన లింక్లపై క్లిక్ చేస్తే, ప్రజలను నకిలీ వెబ్సైట్లకు మళ్లిస్తారని హెచ్చరించింది. ఈ క్రమంలో వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్లు,ఓటీపీ వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించే ప్రయత్నం జరుగుతుందని పేర్కొంది.
Details
కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదు
చఠ్ పూజ సందర్భంగా పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలాంటి సబ్సిడీ లేదా లక్కీ డ్రా పథకం ప్రకటించలేదని PIB స్పష్టంగా తెలిపింది. ఈ సందేశాలకు తపాలా శాఖతో గానీ, ఇతర కేంద్ర ప్రభుత్వ సంస్థలతో గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది. ఇక ఈ నకిలీ మెసేజ్లు అధికారిక ప్రభుత్వ వెబ్సైట్లను పోలి ఉండే విధంగా రూపుదిద్దుకున్నాయని, బహుమతులు లేదా నగదు రివార్డుల పేరుతో ప్రజలను ఆకర్షించి మోసం చేస్తున్నారని వివరించింది. వాట్సాప్, ఎస్ఎంఎస్ లేదా ఈమెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయొద్దని పీఐబీ సూచించింది. మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ నంబర్లు, ఏటీఎం పిన్లు, ఓటీపీ వంటి డేటాను ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరిక జారీ చేసింది.
Details
పూర్తిగా నకిలీ అని నిర్ధారణ
ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు లేదా బహుమతులు పేరుతో వస్తున్న సందేశాల ప్రామాణికతను నిర్ధారించాలనుకుంటే, ఆ సందేశం, లింక్ లేదా ఫోటోను PIB ఫ్యాక్ట్ చెక్ వాట్సాప్ నంబర్ +91 8799711259కు లేదా ఎక్స్ (Twitter) అకౌంట్ @PIBFactCheck కు పంపాలని సూచించింది చట్ పూజ సబ్సిడీ లేదా లక్కీ డ్రా పేరుతో పోస్టాఫీస్ మోసపు లింక్లు పంచుతున్నారు. వాటిపై క్లిక్ చేయొద్దు, ఇది పూర్తిగా నకిలీ ప్రచారం అని PIB హెచ్చరించింది.