PM Modi Telangana Tour : తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. రూ.9,400 కోట్లతో పలుప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీకి బయల్దేరనున్నారు. హెచ్ఐసీసీలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొని పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం హైటెక్ సిటీలోని ఓ ఆస్పత్రిని ప్రారంభిస్తారు. సాయంత్రం 6.30 గంటల నుంచి 7.30 గంటల వరకు హైదరాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మొత్తం రూ.9,400 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించడంతో పాటు శంకుస్థాపనలు చేయనున్నారు. గచ్చిబౌలిలోని హెచ్ఐసీసీ సెంటర్లో ఈ కార్యక్రమం జరగనుంది.
వివరాలు
ప్రధాని ప్రారంభించే, శంకుస్థాపన చేసే ప్రాజెక్టుల వివరాలు ఇవీ:
రూ.3,180 కోట్ల వ్యయంతో హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ (ఎన్హెచ్-167)లో భాగంగా గుడెబల్లూర్ నుంచి మహబూబ్నగర్ వరకు నిర్మించనున్న నాలుగు లేన్ల రహదారి పనులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. రూ.2,360 కోట్లతో జహీరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అభివృద్ధి పనులకు మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పారిశ్రామిక రంగానికి మరింత ఊతం లభించనుంది. రూ.1,250 కోట్ల వ్యయంతో నిర్మించిన కాజీపేట-విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన పలు విభాగాల పనులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు.
వివరాలు
రూ.1,700 కోట్లతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్
కాజీపేటలో రూ.300 కోట్లతో నిర్మించిన రైల్ అండర్ రైల్ బైపాస్ లైన్ను కూడా ఆయన ప్రారంభించనున్నారు. రూ.1,700 కోట్లతో వరంగల్లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన పీఎం మిత్ర పార్క్ (కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్)ను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అలాగే రూ.610 కోట్లతో హైదరాబాద్ మల్కాపూర్లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ నిర్మించిన అత్యాధునిక గ్రీన్ ఫీల్డ్ పీవోఎల్ టెర్మినల్ను కూడా మోదీ ప్రారంభించనున్నారు.