Pune: పుణే ఐటీ రంగంలో కలకలం.. 8 నెలల్లో 5 కంపెనీలు మూత, ఉద్యోగాలు కోల్పోయిన 5 వేల మంది
ఈ వార్తాకథనం ఏంటి
పుణేలోని ఐటీ రంగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత ఎనిమిది నెలల్లో ఐదు ఐటీ కంపెనీలు ఒక్కసారిగా మూతపడటంతో సుమారు 4 వేల నుంచి 5 వేల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. దీంతో ఐటీ సంస్థల నిర్వహణ, నియంత్రణ వ్యవస్థలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా పుణేలోని ప్రముఖ ఐటీ హబ్ హింజేవాడిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న థింక్ టెక్ ఇండియా ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ (Thynk Tech India OPC Pvt Ltd) సంస్థ అకస్మాత్తుగా కార్యకలాపాలు నిలిపివేసింది. ఈ ఘటనలో కంపెనీ యజమాని, సీఈఓ హర్షల్ ఠాకరేపై ఉద్యోగులు, ఇంటర్న్లను మోసం చేసిన ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
వివరాలు
బౌన్స్ అయ్యిన కంపెనీ ఇచ్చిన చెక్కులు
దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం, ఉద్యోగాలు,ల్యాప్టాప్లు ఇస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసిన కంపెనీ, పలుమాసాలుగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేదని ఆరోపణలు ఉన్నాయి. సంస్థ మూతపడటంతో సుమారు 700 నుంచి 1,000 మంది ఉద్యోగులు, ఇంటర్న్లు, ట్రైనీ ఇంటర్న్లు ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు. ల్యాప్టాప్ భద్రతా డిపాజిట్ పేరుతో ఒక్కొక్కరి నుంచి రూ.15 వేల చొప్పున వసూలు చేసి, రెండు నెలల ఇంటర్న్షిప్ తర్వాత జీతం ఇస్తామని హామీ ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. అయితే చాలా మందికి ఇప్పటివరకు జీతాలు అందకపోగా, కంపెనీ ఇచ్చిన కొన్ని చెక్కులు కూడా బౌన్స్ అయినట్లు సమాచారం.
వివరాలు
4 వేల నుంచి 5 వేల మంది ఉద్యోగులకు నష్టం
ఐటీ ఉద్యోగుల హక్కుల కోసం పనిచేస్తున్న ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (FITE) సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం, గత ఎనిమిది నెలల్లో పుణేలో ఐదు కంపెనీలు అకస్మాత్తుగా మూతపడ్డాయి. వీటిలో మూడు సంస్థలు హింజేవాడి ప్రాంతంలో ఉండగా, మరో రెండు విమాన్ నగర్-ఖరాడి కారిడార్లో కార్యకలాపాలు నిర్వహించాయి. ఈ ఘటనల వల్ల మొత్తం 4 వేల నుంచి 5 వేల మంది ఉద్యోగులు నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.
వివరాలు
ఐటీ కంపెనీలపై మరింత కఠిన పర్యవేక్షణ అవసరం: పరిశ్రమ వర్గాలు
ఉద్యోగార్థుల నుంచి డిపాజిట్లు వసూలు చేయడం, నెలల తరబడి జీతాలు నిలిపివేయడం, ఆ తర్వాత కంపెనీలను మూసివేయడం వంటి ఘటనలపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ప్రభుత్వం, సంబంధిత అధికారులు వేగంగా స్పందించలేదని FITE విమర్శించింది. థింక్ టెక్ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగా, యువ ఉద్యోగుల భవిష్యత్తును కాపాడేందుకు స్టార్టప్లు, ఐటీ కంపెనీలపై మరింత కఠిన పర్యవేక్షణ అవసరమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.