Putin India Visit: తటస్థంగా కాదు..శాంతి పక్షం: హైదరాబాద్ హౌస్లో మోదీ-పుతిన్ భేటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశం తటస్థంగా వ్యవహరించడం కాదని, శాంతి సాధనకే నిలబడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ పరిస్థితులపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్తో పాటు రష్యా ప్రతినిధి బృందానికి స్వాగతం పలికిన సందర్భంగా మాట్లాడిన మోదీ, ఉక్రెయిన్ సంక్షోభం మొదలైన నాటి నుంచే రెండు దేశాలు నిరంతర సంప్రదింపులలో కొనసాగుతున్నాయని వెల్లడించారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రతీ పరిణామాన్ని రష్యా ప్రభుత్వం తమకు స్పష్టంగా తెలియజేస్తోందని తెలిపారు. భారత్పై పుతిన్ నేతృత్వంలోని రష్యా పూర్తి నమ్మకం ఉంచుతోందన్న విషయాన్ని ఈ భేటీలో ప్రస్తావించారు. సంభాషణలు, చర్చల ద్వారానే వివాదాలను శాంతియుతంగా పరిష్కరించాలనే విధానానికి భారత్ కట్టుబడి ఉందని మరోసారి స్పష్టం చేశారు.
వివరాలు
ప్రపంచం మళ్లీ శాంతి మార్గంలోకి అడుగులు వేస్తుందని ఆశాభావం
భారత్-రష్యాల మధ్య పరస్పర విశ్వాసమే గొప్ప బలమని పేర్కొన్నారు. దేశాల అభ్యుదయం శాంతి మార్గంలోనే సాధ్యమని వ్యాఖ్యానిస్తూ,అదే దిశగా ప్రపంచాన్ని కలిసి ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటీవల జరుగుతున్న అంతర్జాతీయ ప్రయత్నాల కారణంగా ప్రపంచం మళ్లీ శాంతి మార్గంలోకి అడుగులు వేస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ చిరకాల స్నేహ బంధం పుతిన్ వ్యూహాత్మక దృష్టిని ప్రతిబింబిస్తుందని మోదీ తెలిపారు. ఈ సమావేశంలో పుతిన్ కూడా మాట్లాడారు. భారత్,ప్రధాని మోదీ నుంచి ఎన్నో ఆత్మీయతతో కూడిన స్వాగతం లభించిందని పేర్కొంటూ కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల అనుబంధం పలు దశాబ్దాలుగా బాద్యతలతో,విశ్వాసంతో పెనవేసుకుని కొనసాగుతోందని అన్నారు. ఉక్రెయిన్తో కుదుర్చుకునే శాంతి ఒప్పందానికి సంబంధించిన వివరాలను భారత్తో భాగస్వామ్యం చేసినట్లు కూడా వెల్లడించారు.