Vijayawada: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. కిలో బీపీటీ స్టీమ్ రూ.52కే!
ఈ వార్తాకథనం ఏంటి
బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కిలో నాణ్యమైన బీపీటీ స్టీమ్ బియ్యాన్ని రూ.52కే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏపీఐఐసీ కాలనీ రైతుబజార్లో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ, పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ శ్రీవాస్నుపూర్ అజయ్కుమార్తో కలిసి ఈ విక్రయాలను మంత్రి ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. గత నెల రోజులుగా బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు కిలోకు సుమారు రూ.10 వరకు పెరగడంతో ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించిందన్నారు.
వివరాలు
కిలో రూ.50కే విక్రయం
ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్తో కలిసి పౌరసరఫరాల శాఖ సమన్వయం చేసిందని తెలిపారు.
ఈ నిర్ణయం ప్రకారం గతంలో రూ.64-65 మధ్య విక్రయమైన బీపీటీ స్టీమ్ బియ్యాన్ని ఇప్పుడు కిలో రూ.52కే అందిస్తున్నట్లు చెప్పారు.
అలాగే రూ.58-60 ధర ఉన్న బీపీటీ రా (పచ్చి) బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు.
ఒక్కో కుటుంబానికి గరిష్ఠంగా 10 కిలోల బియ్యం అందజేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 150 రైతుబజార్లు, 500 రైస్మిల్ ఔట్లెట్లలో ఈ ప్రత్యేక విక్రయాలు ఇప్పటికే ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.
భవిష్యత్తులో కందిపప్పు, పామాయిల్ ధరలను కూడా నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.