Railway Station: ఏడాదికి రెండుసార్లు మాత్రమే రైలు వచ్చే స్టేషన్.. ఎక్కడుందో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా ఏ రైల్వే స్టేషన్ అయినా రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించడం సహజమే. కానీ మన దేశంలో ఓ స్టేషన్ మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటంటే, అక్కడికి ఏడాదికి కేవలం రెండుసార్లు మాత్రమే రైలొస్తుంది. ఆ ప్రత్యేకమైన స్టేషన్ పంజాబ్ రాష్ట్రంలోని హుస్సేనీవాలా రైల్వే స్టేషన్. ఇటీవల ఈ స్టేషన్కు సంబంధించిన వీడియోను ఓ సోషల్ మీడియా వ్లాగర్ షేర్ చేయడంతో ఇది నెట్టింట హాట్ టాపిక్గా మారింది. దీంతో ఈ స్టేషన్ గురించి నెటిజన్లు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పుర్.. హుస్సేనీవాలా సరిహద్దు వద్ద ఈ రైల్వే స్టేషన్ ఉంది. ఈ మార్గంలో ఇది చివరి స్టేషన్గా గుర్తింపు పొందింది.
వివరాలు
వీడియోను షేర్ చేసిన ట్రావెల్ వ్లాగర్
అయితే ఆశ్చర్యకరంగా, ఈ స్టేషన్కు ఏడాదిలో కేవలం రెండు రోజుల్లోనే రైళ్లు వస్తాయి. మొదటిది మార్చి 23.. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ అమరుడైన రోజు. ఈ సందర్భంగా ఫిరోజ్పుర్ ప్రాంతానికి సందర్శకులు భారీగా తరలి వస్తారు. రెండోది ఏప్రిల్ 13న జరుపుకునే వైశాఖి పండుగ. ఈ రెండు సందర్భాల్లో మాత్రమే ఈ స్టేషన్ సందడిగా మారుతుంది. మిగతా రోజుల్లో ఈ ట్రాక్పై ఎలాంటి రైలు రాకపోవడంతో, స్థానిక ప్రజలు దీనిని రోడ్డు మార్గంలా ఉపయోగించడం విశేషం. హుస్సేనీవాలా రైల్వే స్టేషన్ గురించి 'నార్తెన్ వ్లాగర్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ ట్రావెల్ వ్లాగర్ వీడియోను షేర్ చేశాడు. ఆ వీడియోకు ఇప్పటికే 11 లక్షలకుపైగా వ్యూస్ రావడం గమనార్హం.