LOADING...
Heavy Rains: తెలంగాణలో వర్షాల బీభత్సం.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక!
తెలంగాణలో వర్షాల బీభత్సం.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక!

Heavy Rains: తెలంగాణలో వర్షాల బీభత్సం.. నేడు, రేపు అతి భారీ వర్షాల హెచ్చరిక!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 13, 2025
09:29 am

ఈ వార్తాకథనం ఏంటి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు అధికమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు ఉప్పొంగి పొంగిపొర్లుతున్నాయి. హనుమకొండ జిల్లాలో అర్ధరాత్రి వేళ ఉధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటే ప్రయత్నంలో చిక్కుకున్న ఓ యువకుడిని పోలీసులు సాహసోపేతంగా రక్షించారు. ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌కు చెందిన గాజుల రాకేష్ గురువారం రాత్రి హుజూరాబాద్‌ నుంచి తన మోపెడ్‌పై తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలో తాళ్లవాగు ఉధృతంగా ప్రవహిస్తుండగా, ఇంటి చేరాలన్న తొందరలో కల్వర్టు దాటేందుకు ప్రయత్నించాడు. వరద ప్రవాహం ధాటికి అదుపుతప్పి వాహనంతోపాటు కిందపడిపోయాడు. వెంటనే తేరుకుని కల్వర్టు స్తంభాలను గట్టిగా పట్టుకుని సహాయం కోసం గట్టిగా అరిచాడు. వెంటనే పోలీసులు అతన్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

Details

రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. రానున్న రెండు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిర్మల్‌, నిజామాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేయగా, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు. శుక్రవారం ఉదయం వరకు ముగిసిన 24 గంటల్లో అత్యధికంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో 22 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా రాష్ట్రంలో ఎన్నో చోట్ల తీవ్ర నష్టం సంభవించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పిడుగులు పడి 94 గొర్రెలు మృతి చెందాయి.

Details

జలాశయాలకు వరదపోటు 

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో జలాశయాలు నిండుకుండలా మారాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు లక్ష క్యూసెక్కుల కంటే ఎక్కువ ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు ఆరు క్రస్ట్‌ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుత నీటి సంవత్సరం (జూన్ 1 నుంచి వచ్చే ఏడాది మే 31 వరకు)లో సాగర్‌ గేట్లు తెరవడం ఇది నాలుగోసారి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీ వరద చేరడంతో 12 గేట్ల ద్వారా గోదావరిలోకి నీటిని వదిలారు. పెద్దపల్లి జిల్లాలో మానేరు నది ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఇసుక తవ్వకాలకు వెళ్లిన నాలుగు ట్రాక్టర్లు డ్రైవర్లతో సహా ఇరుక్కుపోయాయి. వారిని కూడా పోలీసులు అప్రమత్తంగా రక్షించారు.