Rajasthan Raje : దిల్లీలో వసుంధరా రాజే.. పార్టీ అధ్యక్షుడితో మాజీ సీఎం మంతనాలు
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను సాధించింది. ఈ మేరకు సీఎం రేసులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే దిల్లీ బాట పట్టారు. బుధవారం రాత్రి దిల్లీ చేరుకున్న వసుంధర రాజే, గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఫలితాలు వెల్లడై 4 రోజులు గడుస్తున్నా ఇంకా ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేత పేరును ఖరారు చేయలేదు. దీంతో సీఎం అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే రాజే, హస్తీనా బాట పట్టారు. అంతకుముందే 60 మందికిపైగా ఎమ్మెల్యేలకు ఆమె ఫోన్ చేశారని, తనతో భేటీ కావాలని కోరినట్లు సమాచారం. ఇప్పటివరకు 28మంది ఎమ్మెల్యేలతో భేటీ అయినట్లు తెలుస్తోంది.రాజే తన బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.