
AP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!
ఈ వార్తాకథనం ఏంటి
'నా నియోజకవర్గంలో మీ క్రషర్ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.
ఈ ఘటన 2020 సెప్టెంబర్ 4న జరిగింది. ఎన్. చలపతిరావు అనే భాగస్వామిని ఆమె కార్యాలయానికి పిలిపించి తన పీఏ రామకృష్ణతో బెదిరింపులకు పాల్పడ్డారనీ ఏసీబీ పేర్కొంది.
ఆ ఘటన జరిగిన ఆరు రోజులలోపే, సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు జిల్లా ఆర్వీఈవో పల్లె జాషువా ఆ క్రషర్పై తనిఖీలు నిర్వహించి యాజమాన్యంపై ఒత్తిడి పెంచారు.
Details
ఆర్వీఈవో జాషువాకు రూ.10 లక్షలు
జాషువా కూడా 'ఎమ్మెల్యేతో సెటిల్ అవ్వకపోతే క్వారీపై కేసు పెట్టిస్తా. వ్యతిరేక నివేదిక పంపించి రూ.50 కోట్లు జరిమానా వేయిస్తా' అంటూ బెదిరించినట్లు ఏసీబీ వెల్లడించింది.
ఈ ఒత్తిడుల నేపథ్యంలో క్రషర్ యాజమాన్యం విడదల రజనికి రూ.2 కోట్లు, ఆమె మరిది గోపికి రూ.10 లక్షలు, ఆర్వీఈవో జాషువాకు రూ.10 లక్షలు చెల్లించినట్టు ఏసీబీ స్పష్టం చేసింది.
ఈ కేసులో విడదల గోపి మూడో నిందితుడిగా ఉండటంతో, అతనిపై రిమాండ్ రిపోర్టును ఏసీబీ అధికారులు ప్రత్యేక న్యాయస్థానానికి సమర్పించారు.
ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను ఈ నివేదికలో పొందుపరిచారు.
Details
అధికారుల ఆదేశాల ఉల్లంఘన
ప్రభుత్వ ఉత్తర్వులు, ఆర్వీఈవో జాబ్ ఛార్ట్ ప్రకారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులం ఎక్కడైనా తనిఖీలు జరిపే ముందు శాఖ డైరెక్టర్ జనరల్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
అయితే జాషువా ఆ అనుమతి తీసుకోకుండా స్వయంగా గనులు, రెవెన్యూ శాఖాధికారులను పిలిపించి తనిఖీలు నిర్వహించారు. అనంతరం విజిలెన్స్ డీజీకి నివేదిక కూడా సమర్పించలేదు.
రికార్డుల్లోనూ ఈ తనిఖీలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని ఏసీబీ తెలిపింది.
ఆ తనిఖీల్లో పాల్గొన్న ఇతర అధికారులు - "జాషువా ఆదేశాల మేరకే మేం పాల్గొన్నాం. ఆపై ఏం జరిగిందో మాకు తెలియదని తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు.
Details
క్వారీ మూసేయాలన్న రజని
శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్క్రషర్ను మూసివేయాలంటూ రజని, మొదట గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ను ఆదేశించారు. ఆయన నిరాకరించడంతో బెదిరింపులకు పాల్పడ్డారు. చివరకు జాషువా ద్వారా విజిలెన్స్ దాడులు చేయించారు.
నగదు లావాదేవీల స్పష్టత
జాషువా పదేపదే ఒత్తిడి చేయడంతో క్రషర్ యాజమాన్యం రూ.2.20 కోట్లు చెల్లించేందుకు అంగీకరించారు. 2021 ఏప్రిల్ 4న రాత్రి, రజని మరిది గోపికి పురుషోత్తపట్నంలోని ఆయన నివాసంలో రూ.2 కోట్లు ఇవ్వగా, గోపి తన ఫోన్ ద్వారా ఈ విషయాన్ని రజనికి తెలియజేశాడు.
రెండు రోజుల తర్వాత, జాషువా గుంటూరులోని నివాసానికి వెళ్లి రూ.10 లక్షలు, మరోసారి గోపి నివాసం సమీపానికి వెళ్లి రూ.10 లక్షలు అందజేశారు.