Ayodhya: యూపీ బస్సుల్లో, ఆటోల్లో రామకీర్తనలు.. మార్చి 24 వరకు రామభజనలు
హిందువుల ఏళ్ల నాటి కల త్వరలో సాకారం కాబోతోంది. జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని దేవాయలంలో శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్టంచనున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు అయోధ్యకు రానున్నారు. ఈ క్రమంలో రామాలయం ప్రారంభోత్సవంలో భక్తుల్లో ఉత్సాహాన్ని పెంచేందుకు యోగీ ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. యూపీలో మార్చి 24 వరకు బస్సులు, ఆటోలు, ట్యాక్సీల్లోనూ రామ కీర్తనలు ప్లే చేయనున్నారు. యోగి ఆదేశాల మేరకు జనవరి 22న నిర్వహించనున్న ఈ మహా కార్యక్రమానికి రవాణాశాఖ కార్యచరణ సిద్ధం చేసింది.
పరిశుభ్రతను పాటించాలి
యాక్షన్ ప్లాన్ కింద జనవరి 14 నుంచి మార్చి 24 వరకు బస్సుల్లో రామభజన ప్లే చేయాలని ఆదేశాలు ఇచ్చారు. అయోధ్యలోని దేవాలయాల్లో భజన కీర్తన, రామాయణ పారాయణం, రామచరిత్ మానస్ లు, సుందరకాండ కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. ఇక ప్యాసింజర్ వాహనాలు, బస్ స్టేషన్లలో పరిశుభ్రత పాటించి, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్లో రామభజనలు ప్లే చేయాలని సూచనలిచ్చారు. ఇప్పటికే టూరిస్ట్ బస్సు వాహనాల యజమానులందరితో సమావేశాన్ని నిర్వహించారు. ఎలాంటి మత్తు పానీయాలు, పాన్ గుట్కాలు వినియోగించడాన్ని నిషేధించారు. ముఖ్యంగా ఛార్జీలు నిర్ణీత ధరల కంటే ఎక్కువ వసూలు చేయకూడదన్నారు.