Jharkhand: కుప్పకూలిన రాంచీ-ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
జార్ఖండ్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న వారందరూ ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ప్రాథమికంగా వెల్లడించారు. సమగ్ర వివరాల్లోకి వెళితే... రెడ్బర్డ్ ఎయిర్వేస్కు చెందిన బీచ్క్రాఫ్ట్ C90 మోడల్ ఎయిర్ అంబులెన్స్ నిన్న సాయంత్రం 7 గంటల 11 నిమిషాలకు రాంచీ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. తీవ్రంగా గాయపడిన సంజయ్ కుమార్ అనే రోగికి మెరుగైన వైద్యం అందించేందుకు ఢిల్లీకి తరలిస్తున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. టేకాఫ్ అయిన దాదాపు 20 నిమిషాల తరువాత వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మార్గాన్ని మార్చేందుకు పైలట్ అనుమతి కోరినట్లు సమాచారం.
వివరాలు
ప్రమాదంలో ఏడుగురూ మృతి చెందినట్లు అధికారులు వెల్లడి
అయితే ఆ తరువాత విమానంతో సంబంధాలు పూర్తిగా నిలిచిపోయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, రోగి, ఒక వైద్యుడు, ఒక పారామెడిక్ సిబ్బంది, ఇద్దరు సహాయకులు కలిపి మొత్తం ఏడుగురు మరణించినట్లు చత్రా డిప్యూటీ కమిషనర్ కీర్తిశ్రీ జి వెల్లడించారు. అయితే మృతుల సంఖ్యపై భిన్న సమాచారం వెలువడుతోంది. కొందరు ఒకరు మాత్రమే మృతి చెందగా, ఆరుగురు ప్రాణాలతో బయటపడ్డారని నివేదికలు చెబుతున్న నేపథ్యంలో కొంత గందరగోళం నెలకొంది.
వివరాలు
ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు ఏఏఐబీ
సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికార యంత్రాంగం, రక్షణ బృందాలు చత్రా జిల్లాలోని సిమారియా అటవీ ప్రాంతంలో ఉన్న ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. ఈ ఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదానికి గల కారణాలను వెలికితీసేందుకు ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) ప్రత్యేక బృందాన్ని ఘటనాస్థలికి పంపినట్లు సమాచారం. దర్యాప్తు పూర్తి అయిన తర్వాత ప్రమాదానికి దారితీసిన అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.