Page Loader
Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!
రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!

Andhra Pradesh: రూ.17,000 కోట్లతో రాయలసీమ నుంచి ఉత్తరాంధ్రకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 10, 2025
08:18 am

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు 1,200 సర్క్యూట్‌ కిలోమీటర్ల గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ను ఏర్పాటుచేయాలని యోచిస్తోంది. రాయలసీమలోని పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ఉత్తరాంధ్ర ప్రాంతంలో వినియోగించేందుకు ఈ కారిడార్‌ ఎంతో ఉపయోగకరమని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీజీసీఐఎల్‌) నెట్‌వర్క్‌ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో, అదనపు విద్యుత్‌ సరఫరా కోసం గ్రీన్‌ కారిడార్‌ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.

వివరాలు 

అందుబాటులో లేని ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌

ఈ ప్రాజెక్టు కోసం రూ.17,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం, మొత్తం ఖర్చులో 40% నిధులను కేంద్రమే సమకూర్చాలని కోరింది. కొత్తగా అనుమతించిన పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులలో అధికంగా రాయలసీమలోనే ఉన్నాయి. అయితే, ప్రస్తుతం రాయలసీమ,కోస్తా ప్రాంతాలను అనుసంధానించే ట్రాన్స్‌కో నెట్‌వర్క్‌ అందుబాటులో లేదు. రాష్ట్రంలోని మూడు ప్రధాన ప్రాంతాలను కలుపుతూ 10,000 మెగావాట్ల విద్యుత్‌ సరఫరాకు వీలుగా ఈ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలను దక్షిణ ప్రాంత విద్యుత్‌ కమిటీ (ఎస్‌ఆర్‌పీసీ) ఇప్పటికే ఆమోదించింది.

వివరాలు 

ఇదే భారీ నెట్‌వర్క్‌ ప్రాజెక్టు! 

ట్రాన్స్‌కో పరిధిలో ఈ గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ అత్యంత కీలకమైన ప్రాజెక్టుగా మారనుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాయలసీమలో సుమారు 5,000 మెగావాట్ల సౌర, పవన విద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ విద్యుత్‌ను 17 సబ్‌స్టేషన్ల ద్వారా కేంద్ర నెట్‌వర్క్‌కు అనుసంధానించి, ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం పీజీసీఐఎల్‌ నెట్‌వర్క్‌ సామర్థ్యం 17,000 మెగావాట్ల వరకు ఉంది. కానీ అదనంగా వచ్చే విద్యుత్‌ను సరఫరా చేయడానికి నెట్‌వర్క్‌ను మరింత అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

వివరాలు 

రాయలసీమలో10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు

రాయలసీమలో ప్రభుత్వం కొత్తగా 10,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టులు, పంప్డ్‌ స్టోరేజి ప్రాజెక్టులను (పీఎస్‌పీ) అనుమతించింది. ఈ ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను సరఫరా చేసేందుకు అదనపు నెట్‌వర్క్‌ అవసరం అవుతుంది. దీనికోసం కర్నూలు నుంచి విశాఖ వరకు 1,200 సర్క్యూట్‌ కిలోమీటర్ల ప్రత్యేక విద్యుత్‌ లైన్ల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పీజీసీఐఎల్‌ ఆధ్వర్యంలోని ఓర్వకల్లు, గనిలోని 765 కేవీ సబ్‌స్టేషన్లు, అలాగే ట్రాన్స్‌కో పరిధిలోని ఆస్పిరి, కృష్ణపట్నం, పొదిలి, రామాయపట్నం, సత్తెనపల్లి, వేమగిరి, గుడివాడ, కాకినాడ, గంగవరం, నక్కపల్లి సహా మొత్తం 17 (400 కేవీ) సబ్‌స్టేషన్లను అనుసంధానించనున్నారు.

వివరాలు 

ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల అవసరాలు తీర్చేలా... 

ఈ వ్యవస్థ వల్ల ఏదైనా సబ్‌స్టేషన్‌ లోపం ఏర్పడితే, ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్‌ సరఫరా చేసే వీలుంటుంది. అలాగే, కొత్తగా పెందుర్తి ప్రాంతంలో మరో సబ్‌స్టేషన్‌ ఏర్పాటును ప్రతిపాదించారు. ఉత్తరాంధ్రలో విద్యుత్‌ అవసరాలను తీర్చేందుకు గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ కీలక భూమిక పోషించనుంది. విశాఖలోని పూడిమడక వద్ద భారీ గ్రీన్‌ హైడ్రోజన్‌ పార్కును ఎన్‌టీపీసీ, జెన్‌కో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో నిర్మించబోయే గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా ఉత్పత్తి కోసం భారీగా విద్యుత్‌ అవసరం అవుతుంది.

వివరాలు 

త్వరలోనే ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమ

ఈ అవసరాలను తీర్చడానికి, రాయలసీమలోని పునరుత్పాదక విద్యుత్‌ ప్రాజెక్టుల నుంచి విద్యుత్‌ను సరఫరా చేయడానికి గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలాగే, కాకినాడలో గ్రీన్‌కో సంస్థ కూడా గ్రీన్‌ హైడ్రోజన్‌, అమ్మోనియా ప్రాజెక్టులను నెలకొల్పుతోంది. వీటికి కూడా భారీగా పునరుత్పాదక విద్యుత్‌ అవసరం. తదుపరి, విశాఖలో అదానీ, గూగుల్‌ డేటా సెంటర్లు, అలాగే ఆర్సెలార్‌ మిత్తల్‌ ఉక్కు పరిశ్రమ కూడా త్వరలోనే స్థాపించనున్నారు. ఈ సంస్థలకు అధికంగా విద్యుత్‌ అవసరం ఉండటంతో నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచాల్సిన అవసరం ఉంది.

వివరాలు 

కేంద్ర ప్రభుత్వ అనుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు

ఎస్‌ఆర్‌పీసీ ఆమోదించిన ఈ ప్రతిపాదనలను సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ), పవర్‌ గ్రిడ్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలించనుంది. ఆ తర్వాత నేషనల్‌ కమిటీ ఫర్‌ ట్రాన్స్‌మిషన్‌కు పంపించి, ఆమోదం లభించిన తరువాత ప్రాజెక్టు అమలుకు అనుమతులు లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వ అనుమతులను వీలైనంత త్వరగా పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.