Delhi Bomb Blast: ఎర్రకోట పేలుడు విషాదం.. 12కి చేరిన మృతుల సంఖ్య.. ఉగ్ర లింకులపై దర్యాప్తు ముమ్మరం!
ఈ వార్తాకథనం ఏంటి
ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు (Delhi Blast) ఘటన దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. రన్నింగ్ కారులో జరిగిన ఈ భారీ పేలుడులో మృతుల సంఖ్య 12కి పెరిగింది. ప్రారంభంలో 9 మంది ప్రాణాలు కోల్పోగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు గాయపడినవారు కూడా ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం మరో 17 మందికి LNJP ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Details
పేలుడులో అమోనియం నైట్రేట్ వాడారా?
దిల్లీ పోలీసులు పేలుడులో అమోనియం నైట్రేట్ వాడినట్లు అనుమానిస్తున్నారు. FSL బృందాలు ఘటనా స్థలంలో రాత్రంతా తనిఖీలు జరిపాయి. పేలుడుకు సంబంధించిన పలు రసాయన పదార్థాలు, కారు శకలాలు స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం నిందితుడి DNA నమూనాలు కూడా సేకరించింది. ప్రాథమికంగా ఈ ఘటనను ఆత్మాహుతి దాడిగా పరిగణిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Details
ఉగ్రవాద లింకులు బయటపడుతున్నాయా?
పేలుడు జరిగిన కారు పుల్వామాకు చెందిన డా. ఉమర్ మహ్మద్దిగా గుర్తించారు. అతను శ్రీనగర్లోని GMC అనంతనాగ్లో సీనియర్ రెసిడెంట్గా, అనంతరం అల్ ఫలాహ్ ఫరీదాబాద్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాడు. గత నెలలో అమీర్ రషీద్ పేరుతో కారు కొనుగోలు చేసిన ఉమర్, అదే వాహనాన్ని ఈ బాంబ్ దాడిలో వాడినట్లు తెలుస్తోంది.
Details
విచారణ ముమ్మరం
ఈ కేసులో దర్యాప్తు వేగవంతమైంది. జమ్మూ-కాశ్మీర్లో ముగ్గురు అనుమానితులు అరెస్ట్ అయ్యారు. అమీర్ రషీద్ మిర్ (27), ఉమర్ రషీద్ మిర్ (30), తారిఖ్ మాలిక్ (44). వీరిని జమ్మూ-కాశ్మీర్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అంతేకాక, మరో 13 మంది అనుమానితులు ఢిల్లీ పోలీసుల అదుపులో ఉన్నారు. సుమారు 200 మంది పోలీసు సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. బదర్పూర్ సరిహద్దు నుండి ఎర్రకోట వరకు రూట్లోని కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Details
ఫరీదాబాద్, పుల్వామా లింకులు స్పష్టమవుతున్నాయి
పేలుడు కేసు దర్యాప్తులో ఫరీదాబాద్, పుల్వామా ఉగ్ర నెట్వర్క్ లింకులు వెలుగులోకి వస్తున్నాయి. డా. ఉమర్కు కారును అమ్మిన తారీఖ్ పుల్వామాలో అరెస్టయ్యాడు. ఇటీవల ఫరీదాబాద్లో IEDలతో ఇద్దరు డాక్టర్లు అరెస్ట్ అయ్యారు. వారి వద్ద నుంచి 2900 కేజీల అమోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే రసాయనాన్ని ఢిల్లీ కారు పేలుడులో ఉపయోగించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Details
దర్యాప్తు కొనసాగుతోంది
ఈ ఘటనపై FIR నమోదు చేశారు. రెడ్ఫోర్ట్ పోలీస్ పోస్ట్లో పనిచేస్తున్న SI వినోద్ నయన్ స్టేట్మెంట్ ఆధారంగా కేసు నమోదు చేశారు. పేలుడు శబ్దం విన్న వెంటనే ఆయన బయటకు వచ్చి మంటల్లో తగలబడ్డ వాహనాలను చూశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసు దేశవ్యాప్తంగా అలర్ట్ సృష్టించింది. NIA, FSL, మరియు స్థానిక పోలీసు బృందాలు కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాద కోణంలో ఈ కేసును కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిఘా వర్గాలు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటున్నాయి.