Telangana: మార్చి 8న పునరుద్ధరించిన శాసనమండలి భవనం ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్నివచ్చే నెల 8వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. మార్చి 8న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆధునిక సదుపాయాలతో సరికొత్తగా తీర్చిదిద్దిన మండలి భవనాన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో పునరుద్ధరించిన ఈ భవనంలో 80 మంది సభ్యులు సౌకర్యవంతంగా కూర్చునేలా సీటింగ్ వ్యవస్థను రూపొందించారు. ఆగాఖాన్ ఫౌండేషన్ పర్యవేక్షణలో సివిల్ నిర్మాణ పనులు చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం ఈ భవనం పునరుద్ధరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యత ఇచ్చారు. అవసరమైన ఆర్థిక వనరులను విడుదల చేసి పనులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నారు.
వివరాలు
పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణ పనులు
ప్రస్తుత అసెంబ్లీ భవనానికి ఆనుకుని ఈ నిర్మాణం ఉండటంతో, ఇకపై శాసనసభ, శాసనమండలి సమావేశాలను పక్కపక్కనే ఉన్న భవనాల్లో నిర్వహించే వీలు కలుగనుంది. హెరిటేజ్ కట్టడం కావడంతో అసలు నిర్మాణ శైలికి ఎలాంటి హాని కలగకుండా ఆధునిక సదుపాయాలను జోడిస్తూ పునరుద్ధరణ చేపట్టారు. మార్చి 16న ప్రారంభమయ్యే కౌన్సిల్ బడ్జెట్ సమావేశాలను ఈ నూతన భవనంలో నిర్వహించనున్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసిన తరువాత పార్లమెంట్ తరహాలో సెంట్రల్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు సమాచారం.