Srisailam Reservoir: శ్రీశైలంలోకి 2 లక్షల క్యూసెక్కులు.. 107 టీఎంసీలకు చేరిన నిల్వ.. పెరుగుతున్న ప్రవాహాలతో చిగురిస్తున్న ఆశలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో రైతుల్లో సాగునీటిపై ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. అయితే అందుబాటులో ఉన్న నీటి నిల్వలు,ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలు,భవిష్యత్తులో తాగునీటి అవసరాలను సమగ్రంగా అంచనా వేసిన తర్వాతే సాగునీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని నీటిపారుదలశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఖరీఫ్తో పాటు వచ్చే రబీ సీజన్కు నీటి కేటాయింపులపై చర్చించేందుకు సమీకృత నీటి ప్రణాళిక, యాజమాన్యం రాష్ట్రస్థాయి కమిటీ బుధవారం సమావేశం కానుంది. ఇంజినీర్-ఇన్-చీఫ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాజెక్టుల చీఫ్ ఇంజినీర్లు హాజరుకానున్నారు. జలాశయాల్లో ప్రస్తుత నిల్వలు, వరద ప్రవాహాల పరిస్థితి, తాగునీటి అవసరాలు, సాగునీటి విడుదల అవకాశాలపై సమగ్రంగా సమీక్షించనున్నారు.
వివరాలు
శ్రీశైలం జలాశయంలోకి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద
ఇదే సమయంలో శ్రీశైలం జలాశయంలోకి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల వరద కొనసాగుతుండగా, శ్రీరామసాగర్లోకి కూడా ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
రాష్ట్రంలో అత్యధిక ఆయకట్టుకు శ్రీశైలం, శ్రీరామసాగర్ ప్రాజెక్టులే ప్రధాన ఆధారం.
శ్రీశైలం పూర్తిస్థాయిలో నిండిన తర్వాత నాగార్జునసాగర్కు నీటి విడుదల ప్రారంభమైతే సాగర్ ఎడమ కాలువతో పాటు ఎం.ఆర్.ఆర్.పీ, కల్వకుర్తి ప్రాజెక్టుల పరిధిలో సాగునీటి అవకాశాలు మెరుగుపడే పరిస్థితి ఉంటుంది.
ఇక శ్రీరామసాగర్లోకి మరో 40 టీఎంసీల నీరు చేరితే వానాకాలం ఆయకట్టుకు కొన్ని తడులు ఇవ్వడం సాధ్యమవుతుంది.
ఒకవేళ ఆ స్థాయిలో నీరు రాకపోతే, ముందుగా తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని, అనంతరం ముందస్తు రబీ సీజన్కు పరిమిత స్థాయిలో నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
వివరాలు
తాగునీటి భద్రతకే తొలి ప్రాధాన్యం
ఎల్నినో ప్రభావంతో భవిష్యత్తు వర్షాలపై స్పష్టత లేకపోవడంతో తాగునీటి భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ అంశాలన్నింటినీ రాష్ట్రస్థాయి ఇంజినీర్ల కమిటీ సమావేశంలో చర్చించనుంది.
గత ఏడాది వరి 24.74 లక్షల ఎకరాలు, ఆరుతడి పంటలు 15.19 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 39.93 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నుంచి 381.5 టీఎంసీల నీటిని వినియోగించారు.
అప్పట్లో మంచి వర్షాలు కురవడంతో రిజర్వాయర్లు రెండుసార్లు నిండాయి. దీంతో నీటి కొరత సమస్య తలెత్తలేదు.
వివరాలు
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తం
అయితే ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది.
తొలుత 15 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు, 19 లక్షల ఎకరాల్లో వరి సాగుకు ప్రణాళిక రూపొందించినప్పటికీ, ఎల్నినో ప్రభావం నేపథ్యంలో నీటిపారుదలశాఖ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
ఈ స్థాయిలో సాగు చేయాలంటే సుమారు 320 టీఎంసీల నీరు అవసరమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తూ ప్రభుత్వం, వ్యవసాయశాఖ, నీటిపారుదలశాఖలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ, అధిక శాతం రైతులు బావులు, బోర్ల ఆధారంగా వరి నాట్లకే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
వివరాలు
శ్రీశైలంలో కొనసాగుతున్న భారీ వరద
కృష్ణా బేసిన్ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయంలోకి వరద ప్రవాహం కొనసాగుతోంది.
మంగళవారం సాయంత్రం 6 గంటల నాటికి సుమారు రెండు లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, బుధవారం ఈ ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆలమట్టి ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు,నారాయణపూర్ నుంచి 1.48 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
భీమా నది నుంచి వచ్చిన ప్రవాహంతో కలిపి జూరాల ప్రాజెక్టుకు 2.41 లక్షల క్యూసెక్కులు చేరగా, అక్కడి నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.
అలాగే నెట్టెంపాడు, భీమా, కోయిల్సాగర్, జూరాల కుడి, ఎడమ కాలువలతో పాటు అన్ని ప్రధాన కాలువలకు నీటిని వదులుతున్నారు.
వివరాలు
తుంగభద్ర, నాగార్జునసాగర్ పరిస్థితి
తుంగభద్ర జలాశయంలోకి కూడా వరద ప్రవాహం పెరిగి 82 వేల క్యూసెక్కులకు చేరింది.
ప్రస్తుతం అక్కడ 55 టీఎంసీల నీటి నిల్వ ఉండగా,పూర్తిస్థాయిలో నిండేందుకు మరో 50 టీఎంసీలు అవసరం.
శ్రీశైలంలో బుధవారం సాయంత్రానికి నీటి నిల్వ 107 టీఎంసీలకు చేరగా,పూర్తి స్థాయి నిల్వ సాధించేందుకు మరో 108 టీఎంసీలు అవసరమని అధికారులు తెలిపారు.
నాగార్జునసాగర్ పూర్తిగా నిండాలంటే ఇంకా 170 టీఎంసీల నీరు రావాల్సి ఉంది.
సాగర్లో కనీసం 250 టీఎంసీల నిల్వ చేరితే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా నాగార్జునసాగర్ ఎడమ కాలువ,ఎం.ఆర్.ఆర్.పీ, కల్వకుర్తి తదితర ప్రాజెక్టులకు కూడా నీటి విడుదల సాధ్యమవుతుందని నీటిపారుదలశాఖ అధికారులు భావిస్తున్నారు.
వివరాలు
ఎస్సారెస్పీలో 22 వేల క్యూసెక్కుల ప్రవాహం
అయితే ప్రస్తుతం వస్తున్న వరద ప్రవాహం కనీసం మరో పది రోజుల పాటు కొనసాగితేనే ఆ పరిస్థితి ఏర్పడే అవకాశముంది.
శ్రీరామసాగర్ ప్రాజెక్టులోకి ప్రస్తుతం 22వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.
మధ్యాహ్నం సమయంలో 28 వేల క్యూసెక్కులకు చేరిన ప్రవాహం సాయంత్రానికి కొంత తగ్గింది.
ప్రస్తుతం ప్రాజెక్టులో 35 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, పూర్తిస్థాయి నిల్వకు మరో 45 టీఎంసీలు అవసరం.
డెడ్ స్టోరేజీని మినహాయిస్తే వినియోగానికి సుమారు 20 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది.
ఇది ప్రధానంగా తాగునీటి అవసరాలకు సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
మహారాష్ట్రలోని ఎగువ ప్రాజెక్టులు ఇప్పటికే నిండిన నేపథ్యంలో రానున్న రోజుల్లో అక్కడి నుంచి వచ్చే ప్రవాహమే ఎస్సారెస్పీ భవిష్యత్ పరిస్థితిని నిర్ణయించనుంది.
వివరాలు
ఎస్సారెస్పీలో 22 వేల క్యూసెక్కుల ప్రవాహం
నిజాంసాగర్లో ప్రస్తుతం 10 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 7 వేల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది.
దీంతో ఈ ప్రాజెక్టు పరిధిలోని ఆయకట్టుకు కొంతమేర సాగునీరు అందించే అవకాశం ఏర్పడింది.
కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తిస్థాయి నిల్వలను చేరుకున్నాయి.
ఎల్లంపల్లిలోకి ప్రస్తుతం 5 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతుండగా, అక్కడి నుంచి ఎత్తిపోతల ద్వారా మధ్యమానేరుకు 12 వేల క్యూసెక్కుల నీటిని పంపిస్తున్నారు.
వివరాలు
ఎస్సారెస్పీలో 22 వేల క్యూసెక్కుల ప్రవాహం
మధ్యమానేరులో ప్రస్తుతం 16 టీఎంసీల నిల్వ ఉంది. స్థానిక వర్షాలతో కలిపి 18,645 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా, పూర్తి స్థాయిలో నిండేందుకు మరో 10 టీఎంసీలు అవసరం.
ఎగువ మానేరులోకి 5,666 క్యూసెక్కుల నీరు చేరుతోంది. మానేరు వరద ప్రభావంతో అన్నారం బ్యారేజీకి 10 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది.
మరోవైపు ప్రాణహిత నదిలో వరద ప్రవాహం కొంత తగ్గగా, మేడిగడ్డ బ్యారేజీ వద్ద ప్రస్తుతం 1.74 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది.