Mega Industrial Hub: ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడి.. 3,500 మందికి ఉద్యోగాలు
ఈ వార్తాకథనం ఏంటి
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్, వేఫర్ తదితర ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ ప్రాజెక్టును అగస్త్య సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఓర్వకల్లులో 111.66 ఎకరాల భూమిని సంస్థకు కేటాయించింది. ఈ నేపథ్యంలో అనుభవ్ అగర్వాల్ గ్రూపు వ్యవస్థాపకుడు అనుభవ్ అగర్వాల్, ప్రమోటర్ ఆషిమా అగర్వాల్, అగస్త్య ఎనర్జీ సోలార్ ఈపీసీ వ్యాపార విభాగం ఉపాధ్యక్షుడు గౌరవ్ త్రిపాఠి, అగస్త్య ఎనర్జీ సీఈవో బెర్నార్డ్ రాక్, గ్రూప్ ఛైర్మన్ అజయ్కుమార్ అగర్వాల్, సీఎఫ్వో అమిత్ అగర్వాల్ తదితరులు శనివారం కర్నూలుకు వచ్చారు.
వివరాలు
12 గిగావాట్ల సామర్థ్యంతో ఉత్పత్తి
వారు ఓర్వకల్లులో సంస్థకు కేటాయించిన భూమిని పరిశీలించి, అక్కడ శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డిని ఆహ్వానించి సంస్థ భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు.
ఏటా 12 గిగావాట్ల సామర్థ్యానికి సరిపడేలా సమీకృత ఇంగాట్, వేఫర్ల తయారీ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.
త్వరలోనే భూమిపూజ నిర్వహించి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. 2028 నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.
ఈ పరిశ్రమ అందుబాటులోకి వస్తే సుమారు 3,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని సంస్థ ప్రతినిధులు వివరించారు.