Rural Drinking Water Projects: రూ.9,355 కోట్లతో 10 తాగునీటి ప్రాజెక్టులు.. 13 నియోజకవర్గాలకు ఊరట
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామీణ ప్రాంతాల్లో భవిష్యత్తు తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం రూ.9,355 కోట్ల అంచనా వ్యయంతో పది బహుళ గ్రామ ప్రయోజన పథకాల (ఎంవీఎస్) అమలుకు బుధవారం పరిపాలన అనుమతులు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులు పూర్తయితే 13 నియోజకవర్గాల్లో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుంది. ఈ పథకాల అమలులో తొలి దశలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ నిధులను వినియోగించనున్నారు. అనంతరం జల్ జీవన్ మిషన్ (జేజేఎం)తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ నిధులను అనుసంధానం చేసి పనులను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలు
నీటి ఎద్దడితో ఇబ్బందులు పడుతున్న గ్రామాలకు మరో రూ.1,811 కోట్లు
ఇదిలా ఉండగా, జల్ జీవన్ మిషన్ 2.0 అమలు గడువును కేంద్ర ప్రభుత్వం 2028 డిసెంబరు వరకు పొడిగించింది.
దీనిని దృష్టిలో ఉంచుకుని అన్ని ప్రాజెక్టుల నిర్మాణ పనులను 2028 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలో తీవ్రమైన తాగునీటి కొరత ఎదుర్కొంటున్న సుమారు మూడు వేల గ్రామాలకు కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది.
ఈ గ్రామాల్లో ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో రూ.1,811.81 కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులకు అనుమతులు మంజూరు చేసింది.
వివరాలు
2,943 పనులు
ఈ నిధులతో మొత్తం 2,943 పనులు చేపట్టనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోర్లు తవ్వించడంతో పాటు, సమీపంలోని చెరువులు, రిజర్వాయర్ల నుంచి నీటిని సేకరించి గ్రామాలకు సరఫరా చేసే ఏర్పాట్లు చేయనున్నారు.
ఈ పనులను జిల్లా వారీ ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచి, వేగంగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాన్ని ఆదేశించింది.