Subramanian Swamy: సుబ్రహ్మణ్య స్వామికి చుక్కెదురు.. కల్తీ నెయ్యి కేసులో పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
ఈ వార్తాకథనం ఏంటి
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తిరుమలలో కల్తీ నెయ్యి సరఫరా ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ ఓవర్ లాపింగ్ కిందకు రాదని.. పరిపాలనా లోపాలను గుర్తించడానికే దాన్ని ఏర్పాటు చేశారని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
వివరాలు
సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసిన సుప్రీం
కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంపై విచారణ కోసం సుప్రీంకోర్టు ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను నియమించినప్పటికీ, దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక విచారణ కమిషన్/కమిటీ ఏర్పాటు చేయాలని ఈ నెల 3న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు సిట్ను ఏర్పాటు చేసిన పరిస్థితిలో, కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా రాష్ట్రం మరో కమిషన్ లేదా కమిటీని ఏర్పాటు చేయడం సమంజసమా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు, చివరికి నేడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది.